
టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో ఏడో రోజు భారత్ దుమ్ము రేపుతోంది. దాదాపు అన్ని కేటగిరీల్లోనూ అద్భుత విజయాలను చవి చూస్తోంది. ఇప్పటిదాకా ఎదురైన చేదు ఫలితాలను విస్మరించేలా ఒకదాని వెంట ఒకటిగా గెలుపు బాట పట్టింది భారత్. బ్యాడ్మింటన్, హాకీ, అర్చరీ విభాగాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించారు అథ్లెట్లు. అదే జాబితాలో తాజాగా బాక్సింగ్ కూడా చేరింది. భారత బాక్సర్ సతీష్ కుమార్ అద్దిరిపోయే విక్టరీని అందుకున్నాడు. క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించే అర్హతను సాధించాడు. 91 కేజీల పురుషుల సూపర్ హెవీ వెయిట్ విభాగంలో భారత్ క్వార్టర్ ఫైనల్స్లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పురుషుల +91 కేజీల సూపర్ హెవీవెయిట్ బాక్సింగ్ విభాగం ప్రీక్వార్టర్ ఫైనల్స్ బౌట్.. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 8:48 నిమిషాలకు కొకుగికన్ బాక్సింగ్ ఎరినాలో ప్రారంభమైంది. జమైకాకు చెందిన రికార్డో బ్రౌన్తో తలపడ్డాడు ఆర్మీ అధికారి సతీష్ కుమార్. 31 సంవత్సరాల రికార్డో బ్రౌన్కు ఇదే తొలి ఒలింపిక్ గేమ్స్. 1996 తరువాత ఈ విభాగానికి జమైకా ప్రాతినిథ్యాన్ని వహించడం ఇదే తొలిసారి. ఫలితంగా బ్రౌన్పై అంచనాలు ఉన్నాయి. ఒత్తిడి మధ్య రింగ్లోకి దిగిన రికార్డో బ్రౌన్పై సతీష్ కుమార్ మొదటి నుంచీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. పట్టపగలే చుక్కలు చూపించాడు. హెవీవెయిట్ పంచ్లతో సుడిగాలిలా విరుచుకుపడ్డాడు.
ఉత్తర ప్రదేశ్ బులంద్షెహర్కు చెందిన సూపర్ హెవీవెయిట్ బాక్సర్ 32 సంవత్సరాల సతీష్ కుమార్కు కూడా ఇదే తొలి ఒలింపిక్స్. 2014లో ఆసియన్ గేమ్స్లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్లో రజతాన్ని ముద్దాడాడు. ఒలింపిక్స్కు కొత్తే అయినప్పటికీ.. ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ పాల్గొన్న అనుభవంతో రెచ్చిపోయాడు. ఆసియన్ బాక్సింగ్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ బౌట్లో అతను మంగోలియాకు చెందిన అట్గోన్బెయర్ డైవీని ఓడించాడు. ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. క్లాష్ 16 రౌండ్లో రికార్డోను ఓడించడం ద్వారా ఈ కేటగిరీలో క్వార్టర్స్లో ఎంట్రీ ఇచ్చాడు.