న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ 2020 బాక్సింగ్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్పై వరాల జల్లు కురుస్తోంది. లవ్లీనాకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ భారీ నజరానా అందజేశారు. రూ.కోటి నగదు ప్రోత్సాహకం అందజేయడంతో పాటు పోలీస్ శాఖలో డీఎస్పీగా ఉద్యోగాన్ని ప్రకటించారు. సెమీస్లో లవ్లీనా 0-5 తేడాతో ఓటమి పాలైంది. వరుసగా మూడు రౌండ్లలో సుర్మెనెలి (టర్కీ) న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. టోక్యో క్రీడల్లో లవ్లీనాకు దక్కింది కాంస్యమే అయినా అది స్వర్ణంతో సమానమే. ఎందుకంటే భారత బాక్సింగ్కు 9 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో ఆమె తొలి పతకం అందించింది.
IND vs ENG: రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశాకే.. టీమిండియా దశ తిరిగింది! విదేశీ గడపై భారత్ హవా నడుస్తోంది!!
అంతేకాకుండా రాష్ట్రానికి తొలి ఒలింపిక్ పతకం తెచ్చిపెట్టిన లవ్లీనా బోర్గోహైన్కు మరిన్ని ఆఫర్లు ఇచ్చారు. 2024లో జరగనున్న పారిస్ ఒలింపిక్స్ వరకు నెలకు రూ.లక్ష చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు అసోం ప్రభుత్వం నిర్ణయించించింది. అలాగే గువాహటిలో ఒక రహదారికి ఆమె పేరు పెట్టనున్నట్టు సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. ఇక ఆమె సొంతూరు గోలాఘాట్లో ఆమె పేరు మీద స్టేడియం కడతామని చెప్పారు. ఆమె కోచ్కు రూ.10 లక్షల నగదు బహుమతి ఇస్తామన్నారు.
ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలిచిన తర్వాత తొలిసారి గువాహటి చేరుకున్న లవ్లీనా బోర్గోహైన్కు ఘన స్వాగతం లభించింది. సీఎం స్వయంగా విమానాశ్రాయనికి వెళ్లి ఆమెకు ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఆమెను నగరానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లవ్లీనాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లవ్లీనా గ్రామం ఉండే నియోజకవర్గంలో సారుపతర్లో బాక్సింగ్ అకాడమీతో పాటు ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నిర్మించనున్నట్టు సీఎం హామీ ఇచ్చారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడతామన్నారు.
ఒలింపిక్స్ 2020లో తొలిసారి రాష్ట్రానికి పతకం తీసుకురావడం ద్వారా లవ్లీనా పేరు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖితమైందని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. ఆమె సాధించిన విజయం పట్ల రాష్ట్రం ఎంతో గర్వపడుతోందని చెప్పారు. పతకం సాధించినందుకు అభినందించడంతో పాటు కృతజ్ఞతలు కూడా తెలిపారు. అనంతరం లవ్లీనా మాట్లాడుతూ... స్వర్ణ పతకం తేవడంలో విఫలమైనందుకు ఆవేదన వ్యక్తం చేశారు. గోల్డ్ మెడల్ కోసం బాగా ప్రయత్నించినా.. సాధ్యం లేదన్నారు. పారిస్ ఒలింపిక్స్లో మాత్రం పసిడి పతకం తెస్తానని హామీ ఇచ్చారు.