
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్లో బాక్సింగ్ విభాగంలో భారత్కు మరో పతకం ఖాయమైంది. 49 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంగల్ ఫైనల్ చేరాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో ఫిలిప్పియన్ బాక్సర్ కార్లో పాలమ్ను అమిత్ పంగల్ చిత్తుగా ఓడించాడు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
తద్వారా ఈ ఆసియా గేమ్స్లో ఫైనల్ చేరిన ఏకైక భారత బాక్సర్గా అమిత్ పంగల్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు అమిత్ పంగల్ కనీసం రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. శనివారం జరిగే ఫైనల్లో రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేత, ఉజకిస్థాన్ బాక్సర్ హసన్బాయ్ దస్మోస్తవ్తో అమిత్ తలపడనున్నాడు.
ఇదిలా ఉంటే ఈ ఆసియా గేమ్స్లో ఇప్పటికే బాక్సింగ్లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. పురుషుల 75 కేజీల ఈవెంట్లో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ కాంస్య పతకం సాధించాడు. బాక్సింగ్ పోటీల్లో భాగంగా శుక్రవారం పురుషుల 75 కేజీల సెమీఫైనల్ బౌట్ జరగాల్సి ఉంది.
అయితే సెమీ ఫైనల్స్కు ముందు జరిగిన మ్యాచ్లో వికాస్ కంటికి గాయమైంది. అయినా రింగ్లోకి దిగడానికి భారత బాక్సర్ సిద్ధమయ్యాడు. కానీ అతని పరిస్థితిని పరీక్ష చేసిన వైద్యులు, వికాస్ బరిలోకి దిగేందుకు సిద్ధంగా లేడని తేల్చేసింది. దీంతో అతడు కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2010 ఏషియాడ్లో స్వర్ణం పతకం సాధించిన వికాస్ క్రిషన్, ఈ సారి కూడా పసిడి పట్టేస్తాడని అంచనా వేశారు. గాయం కారణంగా పోటీకి దిగకుండానే వెనుదిరిగాడు. అయినా.. వికాస్ కృష్ణన్ చరిత్ర సృష్టించాడు. వరుసగా మూడు ఆసియా గేమ్స్లో పతకాలు సాధించిన భారత తొలి బాక్సర్గా వికాస్ కృష్ణన్ అరుదైన ఘనత సాధించాడు.
2010లో 60 కేజీలో విభాగంలో స్వర్ణం, 2014లో మిడిల్ వెయిట్లో కాంస్య పతకాలను నెగ్గిన వికాస్ కృష్ణన్ తాజా ఆసియా గేమ్స్లో కాంస్య పతకం నెగ్గాడు.