PV Sindhu: వైఎస్ జగన్ ఆశీర్వాద బలంతో పతకం: ఏపీ నుంచి మరింత మంది సింధూలు తయార్

అమరావతి: టోక్యో ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ కేటగిరీలో కాంస్య పతకాన్ని సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఏపీకి చేరుకున్నారు. ఈ ఉదయం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. టోక్యో ఒలింపిక్స్లో తాను సాధించిన కాంస్య పతకాన్ని ముఖ్యమంత్రికి చూపించారు.

విజయవాడకు పీవీ సింధు..
టోక్యో నుంచి మంగళవారం సాయంత్రమే స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యారు. దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆమెను సన్మానించింది. కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నితీష్ ప్రామాణిక్ ఆమెను ఘనంగా సన్మానించారు. రాత్రి ఢిల్లీలోనే బస చేసిన పీవీ సింధు.. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. కోచ్, దక్షిణ కొరియా బ్యాడ్మింటన్ ప్లేయర్ పార్క్ తయీ-సంగ్తో కలిసి హైదరాబాద్లోని ఇంటికి వచ్చారు. అనంతరం ఈ ఉదయం ఆమె గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు.

కనక దుర్గమ్మ అమ్మవారి సేవలో..
తొలుత కనకదుర్గమ్మఅమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, ధర్మకర్త మండలి పీవీ సింధును సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణలు సింధుకు ఆశీర్వచనాలు పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. 2024లో ప్యారిస్లో జరిగి ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు.
తాను ఎప్పుడు, ఏ టోర్నమెంట్లో గెలిచినా.. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. పతకంతో స్వదేశానికి తిరిగి వెళ్లాలనే బలమైన కాంక్షతో తాను టోక్యోకు బయలుదేరి వెళ్లానని అన్నారు. ఏపీ ప్రభుత్వం తనను అన్ని రకాలుగా ప్రోత్సహించిందని పేర్కొన్నారు. త్వరలోనే విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ పనులను చేపడతామని చెప్పారు.

వైఎస్ జగన్తో భేటీ..
అనంతరం ఆమె అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె వెంట పర్యాటకం, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. తాను సాధించిన కాంస్య పతకాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. తాను టోక్యో వెళ్లడానికి ముందు ముఖ్యమంత్రిని కలిశానని, మెడల్తో తిరిగి రావాలని తనను ఆశీర్వదించారని అన్నారు. దానికి అనుగుణంగా తాను మెడల్ను సాధించానని చెప్పారు. ప్రభుత్వం తనను అన్ని విధాలుగా ప్రోత్సహించిందని తెలిపారు.

కీలక సూచనలు చేసిన వైఎస్ జగన్
ఈ సందర్భంగా వైఎస్ జగన్.. పీవీ సింధుకు కొన్ని కీలక సూచనలు చేశారు. విశాఖపట్నంలో కేటాయించిన రెండెకరాల స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని అకాంక్షించారు. ప్రభుత్వం తరపున ఆమెకు 30 లక్షల నగదు బహుమానాన్ని అందజేశారు. ఏపీ ప్రభుత్వం ఇదివరకే ఈ బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేయడానికి పీవీ సింధుకు రెండెకరాల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. దాని నిర్మాణంలో ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications