టోక్యో: ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు జోరు కొనసాగోతుంది. వరుసగా నాలుగో విజయంతో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. రెండో ఒలింపిక్ మెడల్కు అడుగుదూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సింధు 21-13, 22-20తో నాలుగో సీడ్, జపాన్ స్టార్ అకానె యమగుచిని వరుస గేముల్లో ఓడించింది. 56 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధు పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. మ్యాచ్ ప్రారంభంలో కొంచెం వెనుకంజలో నిలిచినా ఆ తర్వాత పుంజుకొని తన ట్రేడ్ మార్క్ స్మాష్, డ్రాప్ షాట్స్తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది.
3-5 వెనుకంజలో నిలిచిన సింధు కళ్లు చెదిరే ఓ స్మాష్తో ఆధిక్యాన్ని అందుకుంది. ఆ తర్వాత అదే జోరులో లీడ్ను 11-7కు పెంచుకొని బ్రేక్కు వెళ్లింది. విరామం అనంతరం సింధు జోరు కనబర్చగా యమగూచి సైతం ధీటుగా బదులిచ్చింది. వరుస పాయింట్లతో దూసుకెళ్లిన సింధు 18-11తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత యమగూచి రెండు పాయింట్లు సాధించినా సింధు 21-13 గేమ్ను 23 నిమిషాల్లో ముగించింది.
సెకండ్ గేమ్లో ఇద్దరు హోరాహోరీ తలపడ్డారు. అయితే సర్వీస్ అందుకున్న సింధు 5-3తో లీడ్ సాధించింది. అనంతరం సింధు జోరు కనబర్చగా యమగూచి అనవసర తప్పిదాలతో 10-5తో వెనుకంజలో నిలిచింది. అదే జోరులో సింధు మరో 4 పాయింట్లు సాధించి 14-8 లీడ్లో నిలిచింది. కానీ ఆ తర్వాత జోరు పెంచిన యమగూచి.. సింధు తప్పిదాలను క్యాచ్ చేసుకుంటూ వరుస పాయింట్లతో స్కోర్లు 16-16తో సమం చేసింది.
అనంతరం ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో స్కోర్లు 20-20తో సమంగా నిలిచారు. కానీ చివర్లో రెండు పాయింట్లు కొట్టిన సింధు 22-20తో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకొని సెమీఫైనల్కు దూసుకెళ్లింది. రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు.. టోక్యోలో మరోకటి గెలిస్తే ఓ మెడల్ను సొంతం చేసుకోనుంది. తాజా విజయంతో యమగూచితో ఉన్న ముఖా ముఖి పోరును సింధు 12-18తో మెరుగుపరుచుకుంది.