
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సైనా నెహ్వాల్, కిండాబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్ విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మరోవైపు సౌరభ్ వర్మ, సమీర్ వర్మలు తొలి రౌండ్ నుండే నిష్క్రమించగా.. సాత్విక్ సాయిరాజు-అశ్విని పొన్నప్ప జోడి సంచలనం సృష్టించారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ సైనా 21-17, 21-19తో ఫితయపోర్న్ చైవాన్ (థాయ్లాండ్)పై గెలిచింది. 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో సైనా శ్రమించి విజయాన్ని అందుకుంది. సైనా గాయం నుంచి పూర్తిగా కోలుకుని కీలక సమయంలో సత్తా చాటింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21-13, 17-21, 21-19తో రెన్ పెంగ్ బో (చైనా)పై గెలుపొందాడు. గంటా ఏడు నిమిషాల పాటు పోరాడి శ్రీకాంత్ పైచేయి సాధించాడు.

హెచ్ఎస్ ప్రణయ్ 21-16, 22-20 తేడాతో వరుస సెట్లలో కీ విన్సెంట్ (హాంకాంగ్)ను ఓడించగా.. పారుపల్లి కశ్యప్ 18-21, 21-8, 21-14 తేడాతో మిషా జిల్బెర్మాన్ (ఇజ్రాయిల్)పై గెలుపొందాడు. టాప్ సీడ్ కెంటో మొమొటా (జపాన్) వాక్ ఓవర్ కారణంగా శుభంకర్ దేవ్ రెండో రౌండ్కు అర్హత సాధించాడు. సౌరభ్ 21-23, 19-21, 21-5తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో.. సమీర్ 23-21, 11-21, 5-21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయారు.
మిక్స్డ్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 21-18, 18-21, 21-17తో చాంగ్ పెంగ్-ల్యూ యింగ్ (మలేసియా) జంటపై విజయం సాధించింది. నేలకుర్తి సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 21-16, 21-13తో కొహి గోండో-అయానె కురిహారా (జపాన్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ చేరారు.