
హైదరాబాద్: బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ పోటీలకు రంగం సిద్ధమైంది. బ్యాడ్మింటన్ ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులు తలపడే టోర్నీ ఇది. దుబాయిలోని హమ్దాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది.
సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం టాప్-8 స్థానాల్లో ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఈ టోర్నీలో పాల్గొంటారు. పురుషుల సూపర్ సిరీస్ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో నిలిచిన శ్రీకాంత్, మహిళల విభాగంలో నాలుగో ర్యాంకర్ సింధులకు భారత్ నుంచి ఈసారి అవకాశం దక్కింది.
దీంతో ప్రతీ మ్యాచ్ హోరాహోరీగా, రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో ఉన్న సైనా నెహ్వాల్కు నిరాశ తప్పలేదు. భారత షట్లర్లకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఈ టోర్నీలో ఈసారి తెలుగు షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధులు బరిలో నిలిచారు. 2008లో ప్రారంభమైన ఈ టోర్నీలో భారత షట్లర్లు ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు.
ఈ టోర్నీలో ఆటగాళ్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో తమ ముగ్గురు ప్రత్యర్థులతో షట్లర్లు తలపడతారు. మూడు మ్యాచ్ల అనంతరం పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన ఆటగాళ్లు సెమీస్కు అర్హత సాధిస్తారు. పాయింట్లు సమమైతే గెలిచిన గేమ్లు, ఒక్కో మ్యాచ్లో గెలిచిన పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటారు.
పురుషుల సింగిల్స్లో గ్రూప్ 'ఎ'లో ఉన్న చైనా స్టార్ ప్లేయర్ చెన్ లాంగ్ చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో గ్రూప్ 'ఎ'లో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే బరిలో నిలిచారు. టోర్నీలో భాగంగా కిదాంబి శ్రీకాంత్ తన తొలి మ్యాచ్లో వరల్డ్ నంబర్వన్, సూపర్ సిరీస్ ఫైనల్స్ డిఫెండింగ్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సన్తో తలపడనున్నాడు.
వీరిద్దరి మధ్య రికార్డు 3-3తో సమంగా ఉంది. 2017లో వరుసగా రెండు సార్లు ఓడిన తర్వాత విక్టర్ను అతని సొంతగడ్డపైనే ఓడించాడు. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే మిగతా ఇద్దరిని ఓడించడం శ్రీకాంత్కు తేలిక. ఇక, గ్రూప్ బీలో షై యుకి (చైనా)పై 3-0తో శ్రీకాంత్కు మెరుగైన రికార్డు ఉంది.
మరో ఆటగాడు చౌ తీన్ చెన్ (చైనీస్ తైపీ)తో రెండు సార్లు పోటీపడగా.. ఇద్దరూ ఒక్కోసారి గెలిచారు. ఈ ఏడాది కిదాంబి శ్రీకాంత్ నాలుగు టైటిల్స్తో సత్తా చాటిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సూపర్ సిరిస్ ఫైనల్స్లో శ్రీకాంత్ విజయం సాధిస్తే వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుని కూడా సొంతం చేసుకుంటాడు.
ఇక పీవీ సింధు విషయానికి వస్తే ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా ఉంది. తన తొలి మ్యాచ్లో చైనాకు చెందిన హి బింగ్జియావోతో తలపడుతుంది. ప్రస్తుతం సింధు 3వ ర్యాంక్లో, బింగియావో 9వ ర్యాంకులో ఉన్నారు. వీరిద్దరి మధ్య 9 మ్యాచ్లు జరగ్గా అందులో సింధు 4 మ్యాచ్ల్లో గెలవగా, ఐదింటిలో ఓడింది.
ఇక, ఈ టోర్నీ డ్రా కూడా సింధుకి అనుకూలంగా ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశం. గ్రూపు-ఎలోనే ఉన్న అకానె యమగూచి (జపాన్)పై 4-2, సయాక సాటొపై 2-1తో సింధుకు మెరుగైన రికార్డు ఉంది. అయితే తొలి మ్యాచ్ ప్రత్యర్థి బింగ్జియావొ (చైనా) నుంచి సింధుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఆరంభంలో వరల్డ్ ఛాంపియన్షిప్లో రజతం గెలిచిన సింధు ఆ తర్వాత ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిళ్లను సాధించింది. ఇక బింగ్జియావో 2017లో ఒక్క జపాన్ ఓపెన్లో మాత్రమే రన్నరప్గా నిలిచింది.