న్యూఢిల్లీ: కరోనా బ్రేక్తో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ మళ్లీ రాకెట్ పట్టుకోనున్నారు. జనవరి 12 నుంచి వరుసగా జరిగే మూడు టోర్నీల్లో బరిలోకి దిగనున్నారు. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకొని భారత బ్యాడ్మింటన్ సంఘం ఎనిమిది మందితో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది.
గత ఒలింపిక్స్ పతాక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్, బి. సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప, ఎన్.సిక్కిరెడ్డి ఈ జట్టులో ఉన్నారు. జనవరి 12-17 మధ్య జరిగే థాయిలాండ్ ఓపెన్తో వీరు తమ ప్రస్థానాన్ని తిరిగి ఆరంభిస్తారు. ఆ తర్వాత బ్యాంకాక్ ఓపెన్ (జనవరి 19-24), బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ (జనవరి 27-31)లో పోటీపడతారు. వీరితో పాటు వ్యక్తిగత కోచ్లు, ఫిట్నెస్ ట్రైనర్లూ అక్కడికి వెళ్లనున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఈ ఏడాది మార్చి నుంచి బ్యాడ్మింటన్ టోర్నీలన్నీ రద్దు అయిన విషయం తెలిసిందే. ఎక్కడైనా ఒక టోర్నీ జరిగినా ఆటగాళ్లే రిస్క్ చేసి వెళ్లారు. భారత్ నుంచి కేవలం కిదాంబి శ్రీకాంత్ ఒక్కడే అక్టోబర్లో డెన్మార్క్ ఓపెన్ ఆడాడు. మళ్లీ బ్యాడ్మింటన్ సందడి మొదలవ్వడం సంతోషంగా ఉందని బాయ్ ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా తెలిపారు.
'సమీప భవిష్యత్తులో టోర్నీలు వరుసగా జరుగుతాయన్న నమ్మకం కలుగుతోంది. 7-8 నెలలుగా మా క్రీడాకారుల్లో చాలామంది ఏ టోర్నీల్లో పాల్గొనలేదు. కానీ ట్రైనింగ్ క్యాంప్ల్లో మాత్రం శిక్షణ పొందుతున్నారు. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్కు ముందు సాధన లభిస్తుందనే పూర్తి జట్టును పంపిస్తున్నాం' అని బాయ్ ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా అన్నారు. ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్, బ్యాంకాక్ ఓపెన్ సైతం అందులో ఉండటం గమనార్హం.