న్యూ ఢిల్లీ: డిసెంబరులో జరిగే వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ను ఈ సీజన్లో సాధిస్తానని స్టార్ షట్లర్ పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. 'ఈ టోర్నీలో ప్రపంచంలోని టాప్ 8 మంది క్రీడాకారిణులు పాల్గొంటారు. ప్రతీ మ్యాచ్లోనూ చెమటోడ్చాల్సిందే. టైటిల్ నెగ్గడానికి వంద శాతం ప్రయత్నిస్తా'అని సోమవారం ఇక్కడ జరిగిన పీబీఎల్ ఈవెంట్కు హాజరైన సింధు తెలిపింది.
అభిమానుల నుంచి గతంలో లభించినట్లుగానే ఈ సారి కూడా మద్ధతు లభిస్తున్నట్లు తెలిపింది. 'పీబీఎల్లో తొలిసారి హైదరాబాద్ తరఫున ఆడబోతుండటం పట్ల చాలా ఉద్వేగానికి లోనవుతున్నాను. గతంలో వేరే జట్టు తరఫున బరిలోకి దిగినా సరే నాకు స్టేడియంలో అభిమానుల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభించింది. ఈ సారి హైదరాబాద్ జట్టుకే ఆడుతుండటంతో మళ్లీ అలాంటి మద్దతే వస్తుందని ఆశిస్తున్నా'అని సింధు పేర్కొంది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నాయకత్వంలో చెన్నై స్మాషర్స్ జట్టు గతంలో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) విజేతగా నిలిచింది. అయితే ఈసారి ఆమె సొంత నగరానికి చెందిన 'హైదరాబాద్ హంటర్స్' తరఫున బరిలోకి దిగనుంది. డిఫెండింగ్ చాంపియన్ కూడా అయిన హంటర్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు శక్తిమేర కృషి చేస్తానని సింధు చెప్పింది. జట్టు సహచరులు మేఘన, రాహుల్ యాదవ్, అరుణ్ జార్జ్లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడింది.
తమ జట్టులో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి ఆటగాళ్లు అయిన లీ హ్యూన్ (కొరియా), ఇసారా (థాయిలాండ్)లాంటి ఆటగాళ్లు తమ జట్టులో ఉండటం వల్ల విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆమె అభిప్రాయపడింది. మీడియా సమావేశంలో హంటర్స్ జట్టు యజమాని వీఆర్కే రావు తదితరులు పాల్గొన్నారు. పీబీఎల్ డిసెంబర్ 22న ప్రారంభం కానుండగా... 25 నుంచి 28 వరకు హైదరాబాద్లో మ్యాచ్లు జరుగుతాయి.