
హైదరాబాద్: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధుపై జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్లో అద్భుత విజయాలతో ఓ వెలుగు వెలుగుతున్న సైనా, సింధు మేలిమి వజ్రాలు అంటూ మెచ్చుకున్నాడు. భారత మహిళా పారిశ్రామికవేత్తల వాణిజ్య విభాగం(ఫిక్కీ) శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఈ స్టార్ షట్లర్లతో పాటు కోచ్ గోపి పాల్గొని తన అనుభవాలను సరాదాగా మీడియాతో పంచుకున్నాడు.
'ఒక కోచ్గా సైనా, సింధును మేలిమి వజ్రాలుగా పరిగణిస్తాను. గెలుపు, ఓటములు అనేది ప్రతి క్రీడాకారుని జీవితంలో సహజం. విజయమనేది ఆత్మవిశ్వాసం నింపితే.. ఓటమి అనేది లోటుపాట్లను సరిదిద్దుకుని మరింత ఎత్తుకు ఎదిగేందుకు దోహదపడుతుంది. టోర్నీల సందర్భంగా మొబైల్ ఫోన్లకు ఇద్దరినీ దూరంగా ఉండమని చెబుతా. అంతేకాదు ఒక్కోసారి గదుల్లో ల్యాప్టాప్లు ఏమన్నా ఉన్నాయా చెక్ చేస్తా, ఫ్రిజ్ల్లో చాక్లెట్లు స్టాక్ లేకుండా ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉంటా. ఎందుకంటే ఒలింపిక్స్లో నా శిష్యుల్లో ఎవరో ఒకరు కచ్చితంగా స్వర్ణం గెలువాలన్నదే నా కల. అందుకే ఇలా కఠినంగా వ్యవహరిస్తుంటా' అని గోపీచంద్ అన్నాడు.
షట్లర్లకు నగదు బహుమతులు: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన షట్లర్లకు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బాయ్) శనివారం నగదు ప్రోత్సాహకాలు అందించింది. బాయ్ చీఫ్ నరిందర్ బాత్రా ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో సింగిల్స్లో స్వర్ణ పతకం సాధించిన సైనాకు రూ.20 లక్షలు, సింధుకు రూ.10 లక్షలు అందజేశారు.
కొద్ది రోజుల ముందే ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా జరిగిన పోటీల్లో సైనా నెహ్వాల్ పీవి సింధుపై పోరాడి రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, దీంతో ఆమె స్వర్ణాన్ని గెలచుకొంది. ఇప్పటికే సైనా ఒలింపిక్స్లో కాంస్యాన్ని గెలుచుకొంది. సింధు 2016 రియో ఒలింపిక్స్లో రజితాన్ని పొందింది.