ఆసియా క్రీడలు వాయిదా పడడంతో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్కు మరో అవకాశం లభించినట్లయింది. 2023లో జరగబోయే ఆసియా క్రీడల కోసం క్రీడాకారులను ఎంపిక చేసే విషయంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరో సెలక్షన్ ట్రయల్స్ను నిర్వహించేందుకు నిర్ణయించింది. దీంతో సెలక్షన్ రేసులో ఉండడానికి లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు మరో ఛాన్స్ దక్కింది. సెప్టెంబరు 10నుండి 25వరకు చైనాలోని హాంగ్జౌ నగరంలో ఆసియా క్రీడలు జరగాల్సి ఉంది. కానీ ఇటీవల చైనాలో కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ఆసియా క్రీడలను శుక్రవారం నిరవధికంగా వాయిదావేస్తూ ఒలింపికి కమిటీ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇక టోర్నీ నిర్వహించేందుకు కొత్త తేదీలను త్వరలోనే కమిటీ ప్రకటించనుంది.
ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి సంజయ్ మిశ్రా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆసియా క్రీడలు 2023కు వాయిదాపడ్డాయి. అంటే ఇంకా ఒక సంవత్సరం సమయం ఉంది. కాబట్టి ఇప్పుడే తుది సెలెక్షన్ జరిగిందని చెప్పడం చాలా కష్టం. ప్లేయర్ల ప్రదర్శనను మళ్లీ అంచనా వేయవలసి ఉంటుంది. కాబట్టి మేము మళ్లీ సెలెక్షన్ ట్రయల్స్ను నిర్వహించడానికి ప్రయత్నిస్తాము అని సంజయ్ మిశ్రా పేర్కొన్నాడు.
ఇటీవల కే.డీ. జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, థామస్ మరియు ఉబెర్ కప్తో సహా ప్రధాన ఈవెంట్ల కోసం సెలక్షన్ ట్రయల్స్ ఏప్రిల్ 15 నుండి 20వరకు జరిగాయి. అయితే ఈ సెలక్షన్స్ ట్రయల్స్ కోసం పని భారం కారణంగా సైనా హాజరుకాలేదు. సైనా నిర్ణయం వివాదానికి దారితీసింది. రెండుసార్లు కామన్ వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయినా సైనా నెహ్వాల్ సెలక్షన్ కోసం రాలేదనే వార్తలపై డిబేట్లు కూడా జరిగాయి. ఈ విషయమై.. ఆసియా గేమ్స్లో ఇంకా సైనా పాల్గొనే అవకాశం ఉందా అని మిశ్రాను మీడియా ప్రశ్నించగా.. ఆయన బదులిస్తూ ఒక సంవత్సరం టైం ఉంది. ఈ టైంలో ఎవరైనా బాగా రాణిస్తే, అది సైనా అయినా లేకపోతే వేరే ప్లేయర్ అయినా సరే రాణిస్తే వారిని సెలెక్ట్ చేస్తామని పేర్కొన్నారు.