కోచ్తో ప్రాక్టీస్..
'కనీసం సింగపూర్ ఓపెన్ అయినా నిర్వహిస్తారని మేమంతా ఆశించాం. అది కూడా రద్దు కావడంతో ఇక ప్రత్యామ్నాయం లేదు. దాంతో పలువురు షట్లర్లతో మ్యాచ్లు ఆడుతున్నా. అంతర్జాతీయ పోటీలలో ఉండే పరిస్థితులు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఉండేలా మా కోచ్ పార్క్ సంగ్ చర్యలు తీసుకుంటోంది. ఒక్కో షట్లర్ ఆటశైలి ఒక్కోలా ఉంటుంది. తైజు, రచనోక్లది విభిన్న శైలి. దాంతో వారిని ఎదుర్కొనేలా పార్క్ నన్ను తయారు చేస్తోంది. నెలల విరామం తర్వాత ఒలింపిక్స్లో ఒకరినొకరం ఎదుర్కోబోతున్నాం. అందువల్ల మా ఆట తీరులో కూడా మార్పు ఉంటుంది. వాటికి తగ్గట్టు సిద్ధం కావాలి'అని సింధు చెప్పింది.
రద్దు చేయడమే మంచిది..
ఒలింపిక్స్లో పోటీపడే షట్లర్లతో కలిసి సింధు ప్రాక్టీస్ చేయడంలేదు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సాధన చేస్తున్న ఆమె.. సుచిత్ర అకాడమీలో శారీర దారుఢ్య శిక్షణ తీసుకుంటోంది. ఇక, ఆట కన్నా జీవితం ముఖ్యమంటున్న సింధు.. కొవిడ్తో టోర్నమెంట్లను బీడబ్ల్యూఎఫ్ రద్దు చేయడాన్ని సమర్థించింది. 'చిన్నపాటి వైర్స్తో ప్రపంచం మొత్తం స్తంభించడం విచారకరం. అయితే క్రీడలకన్నా జీవితం ముఖ్యం కదా' అని వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్లో కొవిడ్ నిబంధనలను పాటించడం అటు నిర్వాహకులకు ఇటు అథ్లెట్లకు సవాలని చెప్పిన సింధు.. వాటిని ఎలా ఎదుర్కొంటామో చూడాల్సి ఉందన్నది.
ఒలింపిక్స్ కోసం రిస్క్..
ఒలింపిక్స్ సజావుగా జరుగుతాయా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. కరోనా విలయ తాండవంలోనూ స్టేడియాలకు వెళ్లి సాధన చేయడానికి కారణం ఒలింపిక్స్. ప్రతిష్టాత్మక క్రీడల్లో దేశానికి పతకం అందిచాలన్నదే ఏకైక లక్ష్యం. ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఫిట్నెస్ కాపాడుకుంటూ.. శిక్షణ తీసుకుంటున్నాం. అత్యుత్తమ స్థితిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం.
అయితే అసలు ఒలింపిక్స్ నిర్వహిస్తారా? లేదా? అన్నదాంట్లో స్పష్టత లేదు. రిస్క్ అని తెలిసినా ఒలింపిక్స్కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం మలేసియా, సింగపూర్ ఓపెన్లలో ఆడేందుకు సిద్ధమయ్యాం. ఒలింపిక్స్ నిర్వహించలేమని ముందుగా చెబితే అర్థం చేసుకుంటాం. కాని ఏమీ తెలియట్లేదు. టోక్యోలో కేసులు పెరుగుతున్నాయి. అక్కడ కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒలింపిక్స్ జరుగుతాయా? లేదా? అన్నది తెలియట్లేదు.
జాగ్రత్తలు పాటిస్తూ..
గత ఏడాది కూడా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం. కరోనా ఎందుకు వస్తుందో? ఎలా వస్తుందో? ఎవరికి వస్తుందో? తెలియక భయాందోళనలకు గురయ్యాం. ఇప్పుడు కరోనాపై కొంత అవగాహన వచ్చింది. దేశంలో కేసులు పెరుగుతున్నాయి. కానీ వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలామందిలో అవగాహన వచ్చింది. ఏమీ ముట్టుకోకుండా.. ఎవరినీ తాకకుండా.. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు పెట్టుకుంటూ.. పదే పదే చేతులు శుభ్రం చేసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నాం.'అని సింధు చెప్పుకొచ్చింది.