న్యూఢిల్లీ: విమర్శలు, ఒత్తిడి నాపై ఎలాంటి ప్రభావం చూపవు అని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. నా టెక్నిక్లో కొన్ని లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టా. ఆటను మరింత మెరుగుపరుచుకొని ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించడమే నా లక్ష్యం అని సింధు పేర్కొంది. బుధవారం సింధు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను అభిమానులతో పంచుకుంది.
భారత యువ క్రికెటర్పై వేటు.. ఏడాది పాటు నిషేధం!!
'గతేడాది ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ గెలువడం సంతోషంగా అనిపించింది. అనంతరం వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఆడిన ప్రతీ టోర్నీలోనూ అధిక శాతం ప్రాథమిక దశలోనే వైదొలిగా. అయినా కూడా ఎప్పుడూ సానుకూలంగానే ఉన్నా. అన్ని మ్యాచ్లు గెలువడం ఎవరికీ సాధ్యం కాదు. కొన్నిసార్లు బాగా ఆడినా.. ఓడిపోతుంటాం. తప్పుల నుంచి నేనేంతో నేర్చుకున్నా. సానుకూలంగా ఉంటూనే మరింత మెరుగవడం నాకు ఎంతో ముఖ్యం' అని సింధు తెలిపింది.
'ఈ ఏడాది కూడా చాలా టోర్నీలు ఉన్నాయి. మలేషియా (జనవరి 7 నుంచి 12), ఇండోనేషియా (జనవరి 14 నుంచి 19) టోర్నీలతో ప్రయాణం ప్రారంభించాలి. మరోవైపు ఒలింపిక్స్ క్వాలిఫికేషన్స్ కోసం కూడా కొన్ని టోర్నీలు జరుగనున్నాయి. నాకు ప్రతి టోర్నీ ముఖ్యమైనదే. ఈనెల 22 నుంచి జరుగనున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) కోసం ఎదురుచూస్తున్నా. టోర్నీలోని ప్రతీమ్యాచ్ ముఖ్యమే. అంతర్జాతీయ టోర్నీలతో పోలిస్తే పీబీఎల్ నాకు ప్రత్యేకమైన పోటీ. అందుకే నేను ఈ టోర్నీ ఆడేందుకు ఇష్టపడతా' అని సింధు పేర్కొంది.
'పీబీఎల్ లీగ్ మొత్తం భారత్లో జరుగుతుంది. టాప్ ప్లేయర్లు ఆడితే చూడాలని అభిమానులు కోరుకుంటారు. సొంత ప్రేక్షకులు, అభిమానుల సమక్షంలో ఆడటాన్ని ఆస్వాదిస్తా. యువ షట్లర్లకు స్ఫూర్తిగా నిలిచినట్లు కూడా ఉంటుంది. నాపై ఎన్నో అంచనాలు ఉంటాయని తెలుసు. అయితే ఒత్తిడి, విమర్శలు నాపై ఎలాంటి ప్రభావం చూపవు. నా టెక్నిక్లో కొన్ని లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టా. మరో ఒలింపిక్ పతకం సాధించాలనే లక్ష్యంపైనే దృష్టి పెట్టా' అని సింధు చెప్పుకొచ్చారు.