ఫుజౌ (చైనా): ప్రపంచ చాంపియన్గా అవతరించాక ఆడిన ప్రతీ టోర్నీలో నిరాశపరిచిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ తొలి రౌండ్లో ఓడిపోయిన సింధు ఇంటిదారి పట్టింది. చైనా ఓపెన్ టోర్నీ మహిళల సింగిల్స్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి రౌండ్లో 13-21, 21-18, 19-21తో పాయ్ యు పో (చైనీస్ తైపీ) చేతిలో సింధు ఓడిపోయింది.
ఢిల్లీ టీ20: తీవ్ర వాయుకాలుష్యంలో మ్యాచ్.. వాంతి చేసుకున్న ఇద్దరు బంగ్లా క్రికెటర్లు!!
74 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్ 42 అయిన పాయ్ యు పో చేతిలో ఆరో సీడ్ సింధు ఓడిపోవడం విశేషం. చైనీస్ తైపీ తొలి గేమ్ను సునాయాసంగా గెలుచుకుంది. సింధుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం కొనసాగిస్తూ గేమ్ను సొంతం చేసుకుంది. అయితే పుంజుకున్న సింధు సత్తాచాటి రెండో గేమ్లో విజయం సాధించింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. సింధు-పాయ్ నువ్వానేనా అన్నటుగా ఆడినా.. చివరకు పాయ్ విజయం సాధించింది.
ప్రపంచ చాంపియన్ అయ్యాక సింధు చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీతోపాటు కొరియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో పాల్గొంది. ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన సింధు.. మిగతా మూడు టోర్నీల్లో ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. చైనా ఓపెన్లోనూ సింధు తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది.
మరోవైపు సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో చైనా ప్లేయర్ కాయ్ యాన్ యాన్తో తలపడుతుంది. తొలి రౌండ్లో గెలిస్తే సైనాకు ప్రిక్వార్టర్ ఫైనల్లో బుసానన్ (థాయ్లాండ్) లేదా లైన్ జార్స్ఫెల్ట్ (డెన్మార్క్) ఎదురయ్యే చాన్స్ ఉంది. ఈ రౌండ్నూ దాటితే క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్) రూపంలో సైనాకు కఠిన ప్రత్యర్థి ఉండే అవకాశముంది.
మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకున్న హెచ్ఎస్ ప్రణయ్ 17-21 18-21తో డెన్మార్క్కు చెందిన రాస్ముస్ గెమ్కే చేతిలో ఓడిపోయాడు. స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. సాత్విక్-అశ్విని జోడి కెనడాకు చెందిన జాషువా హర్ల్బర్ట్ యు, జోసెఫిన్ వులను 21-19 21-19 తేడాతో ఓడించి ముందంజ వేశారు.