ఢిల్లీ: ప్రతిష్టాత్మక 'వరల్డ్ టూర్ ఫైనల్స్' టోర్నమెంట్ నిబంధనల్లో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కీలక మార్పులు చేసింది. గతంలో ప్రపంచ చాంపియన్స్ హోదాలో ర్యాంకింగ్స్తో నిమిత్తం లేకుండా ఆటగాళ్లు నేరుగా ఈ టోర్నీలో పాల్గొనేవారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎత్తివేసిన బీడబ్ల్యూఎఫ్.. ఇతర వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పాయింట్ల ప్రకారమే అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తామని తాజాగా ప్రకటించింది.
'కొత్త నిబంధనల ప్రకారమే బ్యాంకాక్లో జరుగనున్న ఫైనల్స్ టోర్నీకి అర్హులైన ఆటగాళ్లను అనుమతిస్తాం. వరల్డ్ చాంపియన్లకు ఎలాంటి మినహాయింపు లేదు. వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పాయింట్లనే పరిగణలోకి తీసుకుంటాం' అని బీడబ్ల్యూఎఫ్ ప్రకటన విడుదల చేసింది. పురుషుల, మహిళల సింగిల్స్లో తొలి ఎనిమిది లోపు ర్యాంకుల్లో నిలిచిన ప్లేయర్లు తలపడే ఈ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్లకు నేరుగా ప్రవేశం ఉండేది. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా చాలా టోర్నీలు రద్దు కావడంతో.. ఈ నిబంధనల్లో బీడబ్ల్యూఎఫ్ మార్పులు చేసింది. పురుషుల, మహిళల ప్రపంచ ఛాంపియన్లకు నేరుగా ప్రవేశం కల్పించడాన్ని రద్దుచేసింది.
బీడబ్ల్యూఎఫ్ నిర్దేశించిన ప్రమాణాల మేరకు పీవీ సింధు ఆసియా లెగ్-1, 2 టోర్నీల్లో రాణించి ఫైనల్స్కు అర్హత సాధిస్తుందని ఆమె తండ్రి పీవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. 'సింధు ప్రపంచ చాంపియన్, గతంలో 'ఫైనల్స్' టైటిల్ కూడా నెగ్గింది. ప్రస్తుతం మా లక్ష్యం ఒలింపిక్స్, ఆల్ ఇంగ్లండ్ టైటిల్' అని ఆయన వ్యాఖ్యానించారు.
వ్యక్తిగత కారణాలతో మంగళవారం మొదలయ్యే డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పుకున్న సింధు.. ప్రపంచ టూర్ ఫైనల్ ఆడాలంటే ఆసియా ఓపెన్ తొలి, రెండో అంచె టోర్నీల్లో సత్తాచాటాల్సి ఉంది. వైరస్ కారణంగా వాయిదా పడ్డ ఆసియా తొలి, రెండో అంచె టోర్నీలు, ప్రపంచ టూర్ ఫైనల్ వచ్చే జనవరిలో జరగనున్నాయి. మరోవైపు కరోనా కారణంగా మార్చిలో ఆగిపోయిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ మంగళవారం డెన్మార్క్ ఓపెన్తో పునఃప్రారంభం కానుంది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్తో పాటు యువ సంచలనం లక్ష్యసేన్, అజయ్ జయరాం, శుభంకర్ డే బరిలో నిలిచారు.