న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దాదాపు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత థాయ్లాండ్ వేదికగా జరగనున్న రెండు బ్యాడ్మింటన్ టోర్నీల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్లు మళ్లీ రాకెట్ పట్టనున్నారు. అయితే ఈ టోర్నీల్లో పీవీ సింధుకు సులువైన డ్రా లభించగా.. సైనా నెహ్వాల్కు టఫ్ డ్రాలు పడ్డాయి. సూపర్-1000 టోర్నీల్లో భాగంగా వచ్చేనెల 12 నుంచి 17వరకు యోనెక్స్ థాయ్లాండ్ ఓపెన్, 19 నుంచి 24 వరకు టొయోటా థాయ్లాండ్ ఓపెన్ జరగనున్నాయి.
తొలి ఈవెంట్లో అన్సీడెడ్ మియా బ్లిచ్ఫెడ్(డెన్మార్క్)తో సింధు, ప్రపంచ మాజీ చాంపియన్ నొజొమి ఒకుహర(జపాన్)తో సైనా ఆరంభరౌండ్లలో తలపడనున్నారు. ఇక రెండో టోర్నీ ఫస్ట్ రౌండ్లో బుసానన్(థాయ్లాండ్)తో సింధు, మాజీ చాంపియన్ రచనోక్(థాయ్లాండ్)తో సైనా తమ పోరును ప్రారంభించనున్నారు.
ఇక పురుషుల సింగిల్స్లో.. యెనెక్స్ ఈవెంట్ తొలి రౌండ్లో శ్రీకాంత్, సౌరభ్ వర్మ అమీతుమీ తేల్చుకోనున్నారు. కెంథాపన్ వాంగాచారెన్(థాయ్లాండ్)తో సాయిప్రణత్, ఎనిమిదో సీడ్ లీజీజై(మలేసియా)తో ప్రణయ్, కెంటా నిషిమొటో(జపాన్)తో కశ్యప్, సెషర్ హిరన్ రుస్తవిటో(ఇండోనేషియా)తో సమీర్ వర్మ, రస్మస్ గెమ్కీ(డెన్మార్క్)తో లక్ష్యసేన్ తొలి రౌండ్లో పోటీపడనున్నారు.
తర్వాత జరిగే టయోట ఈవెంట్ ఫస్ట్ రౌండ్లో సిత్తికొమ్ తమ్మిసిన్(థాయ్లాండ్)తో శ్రీకాంత్, డారెన్ లీ(డెన్మార్క్)తో ప్రణీత్, చోథిన్ చెన్(చైనీస్ తైపీ)తో లక్ష్యసేన్, రస్మన్ గెమ్కీ(డెన్మార్క్)తో కశ్యప్, జొనాథన్ క్రిస్టీ(ఇండోనేషియా)తో ప్రణయ్ తలపడనున్నారు. సమీర్, సౌరభ్ వర్మలు తొలి రౌండ్లో వరుసగా లీజీజై, ఆంథోని సినిసుకతో పోటీపడనున్నారు. మెన్స్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కూడా ఈ రెండు టోర్నీల్లో బరిలోకి దిగుతున్నారు.