
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా లండన్ వెళ్లారు. టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కోసం జాతీయ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న సింధు.. ఉన్నపళంగా విదేశాలకు పయనమయ్యారు. అయితే పేరెంట్స్ లేకుండా తొలిసారి ఆమె విదేశాలకు వెళ్లారు. తన కుటుంబంలో వచ్చిన కలహాల కారణంగానే సింధు లండన్కు వెళ్లినట్టు ఓ మీడియా తన కథనంలో పేర్కొంది. అయితే తమ కుటుంబంలో ఎలాంటి విభేదం లేదని సింధు తాజాగా స్పష్టం చేశారు.
ఒలింపిక్స్ జాతీయ శిక్షణా శిబిరం నుంచి వైదొలిగి పీవీ సింధు లండన్ వెళ్లినట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ప్రకటన చేస్తూ ఆ వార్తలు ప్రచురించిన రిపోర్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పూర్తి ఫిట్నెస్ సాధించడానికే కొద్ది రోజుల క్రితం నేను లండన్కు వచ్చా. నా కుంటుంబ సభ్యుల అనుమతితోనే ఇక్కడి జీఎస్ఎస్ఐ (గ్యాటోరేడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇన్స్టిట్యూట్)కు వచ్చా. మా అమ్మా నాన్నతో ఎలాంటి విభేదాలూ లేవు. నా కోసం తమ జీవితాలు త్యాగం చేసిన వారితో నాకెందుకు సమస్యలు ఉంటాయి. అవన్నీ తప్పుడు వార్తలు. రోజూ వాళ్లతో మాట్లాడుతున్నాను' అని సింధు అన్నారు.
'నా కోచ్ పుల్లెల గోపీచంద్తో గానీ, ట్రైనింగ్ అకాడమీలో గానీ ఎలాంటి సమస్యలూ లేవు. నా గురించి తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాసిన ఆ విలేకరి.. ఇకపై ఇలాంటి రాతలు రాయడం ఆపేయాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటా' అని పీవీ సింధు పోస్ట్ చేశారు. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ లాక్డౌన్ తర్వాత.. సింధు ఎటువంటి టోర్నీలో పాల్గొనలేదు. ఇక తర్వలో జరగాల్సిన ఊబర్ కప్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఆమె ఇటీవల ప్రకటించారు.
కొద్ది రోజుల క్రితం లండన్ వెళ్లిన ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు అక్కడ గాటోరేడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన రెబక్కా రాండెల్తో దిగిన ఫోటోను షేర్ చేశారు. తన కోచ్ పుల్లెల గోపిచంద్కు కూడా ఈ విషయాన్ని చెప్పినట్లు సింధు పేర్కొన్నారు. రెండు నెలల వరకు సింధు ఇండియాకు రాదన్న సమాచారం బయటకు వచ్చింది. ఈ రెండు నెలలు అక్కడే ఉండి పూర్తి ఫిట్నెస్ సాదిస్తారట.