తొలి గేమ్ కోల్పోయినా.. మ్యాచ్ గెలిచి
చివరివరకూ హోరాహోరీగా సాగిన పోరులో స్టార్ షట్లర్ సింధు 11-15, 15-8, 15-13తో మారిన్పై విజయం సాధించింది. ఆట ఆరంభంలో మొదట మారిన్ తన ‘పవర్' చాటింది. దీంతో తొలిగేమ్ స్పెయిన్ స్టార్ వశమైంది. సింధు పదేపదే చేసిన అనవసర తప్పిదాలు కూడా మారిన్కు కలిసొచ్చాయి. కోర్టులో ఇద్దరు దీటుగా స్పందించినప్పటికీ మారిన్ షాట్లు పాయింట్లను తెచ్చిపెట్టాయి. తర్వాత రెండో గేమ్లో మాత్రం సింధు తన ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలివ్వలేదు. ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా కష్టపడిన ఆమె ఈ గేమ్లో మారిన్ను తొందరగానే ఓడించింది.
పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ను ఓడించి
ఇక చివరి గేమ్ మాత్రం అద్భుతంగా సాగింది. గెలుపు దశలో ఒక్కో పాయింట్ ఇద్దరికీ సమాన అవకాశాలిచ్చింది. 13-13 స్కోరుదాకా దోబూచులాడిన విజయం చివరకు తెలుగు తేజం వరుసగా రెండు పాయింట్లు గెలవడంతో సింధు పక్షాన నిలిచింది. పురుషుల సింగిల్స్లో మార్క్ కల్జోవ్ 10-15, 15-12, 15-14తో లక్ష్యసేన్పై విజయం సాధించి హైదరాబాద్కు శుభారంభాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో తొలి గేమ్ను గెలిచి.. ఆ తర్వాత రెండు గేముల్లో చివరిదాకా పోరాడిన లక్ష్యసేన్.. కల్జోవ్ అనుభవానికి తలొంచాడు.
హంటర్స్ ట్రంప్ మ్యాచ్గా ఎంచుకోగా
పురుషుల డబుల్స్ మ్యాచ్ను పుణె ట్రంప్ మ్యాచ్గా ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్లో చిరాగ్శెట్టి-మతియస్ బో 15-13, 10-15, 13-15తో కిమ్సా రంగ్- బొడిన్ ఇసారా చేతిలో ఓడిపోవడంతో పుణెకు ఎదురుదెబ్బ తగిలింది. రెండో సింగిల్స్ను హంటర్స్ ట్రంప్ మ్యాచ్గా ఎంచుకోగా.. ఈ పోరులో హ్యున్ 15-14, 15-12తో లెవర్డెజ్పై గెలిచాడు. దీంతో పీబీఎల్-4 సీజన్ను క్లీన్స్వీప్తో హైదరాబాద్ హంటర్స్ జట్టు ఘనంగా ప్రారంభించింది. ఆదివారం జరిగే పోటీల్లో ముంబై రాకెట్స్తో ఢిల్లీ డాషర్స్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడతాయి.