హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్లో ఢిల్లీ డాషర్స్ వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఓడింది. బుధవారం జరిగిన పోరులో బెంగళూరు రాప్టర్స్ 2-1తో ఢిల్లీ డాషర్స్పై నెగ్గింది. బెంగళూరు కెప్టెన్ కిదాంబి శ్రీకాంత్.. సాయి ప్రణీత్ల కృషి ఫలించి మ్యాచ్ గెలిచేందుకు దోహదపడింది. వొడాఫోన్ ప్రీమియర్ బ్మాడ్మింటన్ లీగ్ సీజన్ 4లో భాగంగా ద ఎరెనా స్టేడియంలో జరిగిన మ్యాచ్ విజేతగా బెంగళూరు నిలిచింది. అంతేకాదు ఇది బెంగళూరు జట్టుకు వరుసగా రెండో విజయం. వ్యక్తిగతంగా చూస్తే శ్రీకాంత్ ఈ సీజన్లో మూడు మ్యాచ్లను విజయంతోనే ముగించాడు.
ముందుగా ఒకరి ట్రంప్ మ్యాచ్ను మరొకరు గెలవడంతో ఈ పోటీలో రెండు మ్యాచ్లు ముగిసినా కూడా స్కోరు 0-0గానే ఉండిపోయింది. ఢిల్లీ 'ట్రంప్' మ్యాచ్లో ప్రణయ్ 12-15, 15-14, 13-15తో సాయిప్రణీత్ (బెంగళూరు) చేతిలో కంగుతినగా... బెంగళూరు 'ట్రంప్' మిక్స్డ్ డబుల్స్లో ఎలిస్-లారెన్ స్మిత్ జంట 13-15, 9-15తో జొంగ్జిత్-కొసెట్స్కయా (ఢిల్లీ) ద్వయం ముందు తలవంచింది.
తర్వాత రెండో పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ (బెంగళూరు) 15-6, 12-15, 15-10తో సుగియార్తో (ఢిల్లీ)పై... మహిళల సింగిల్స్లో తి త్రంగ్ వు 12-15, 15-3, 15-8తో చియా సిన్ లీపై నెగ్గడంతో రాప్టర్స్ విజయం ఖాయమైంది. చివరగా జరిగిన పురుషుల డబుల్స్లో బియావో-జొంగ్జిత్ (ఢిల్లీ)15-7, 11-15, 15-14తో అహ్సాన్-సెతియవాన్ (బెంగళూరు)పై నెగ్గారు.
జనవరి 6వరకూ లీగ్ మ్యాచ్లు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత వొడాఫోన్ పీబీఎల్ సీజన్ 4 ఫైనల్ మ్యాచ్ను బెంగళూరు వేదికగా నిర్వహిస్తారు.