హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సీజన్-5లో హైదరాబాద్ హంటర్స్ జట్టు సొంతగడ్డపై శుభారంభం చేసింది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హంటర్స్ 2-1 తేడాతో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ను ఓడించింది. అయితే సొంత అభిమానుల మధ్య భారీ అంచనాలతో బరిలోకి హంటర్స్ స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి షాక్కు గురి చేసింది. ఆద్యంతం తడబడి ఓటమితో నిరాశపర్చింది. అయితే తుది ఫలితం హంటర్స్కు అనుకూలంగా రావడం మాత్రం ఊరట. మహిళల సింగిల్స్ మ్యాచ్లో సింధు 8-15, 9-15 స్కోరుతో మిషెల్లీ లీ (నార్త్ ఈస్టర్స్ వారియర్స్) చేతిలో పరాజయంపాలైంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్లో థీమ్ సంచలన విజయం.. నాదల్కు షాక్!!
ముందుగా జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో ఇవనోవ్- సిక్కిరెడ్డి జోడీ 15-12, 8-15, 15-12తో కృష్ణప్రసాద్-కిమ్ హన జంటపై గెలిచి హైదరాబాద్కు శుభారంభం ఇచ్చింది. అయితే హంటర్స్ ట్రంప్గా ఎంచుకున్న మ్యాచ్లో సౌరభ్ వర్మ 14-15, 14-15తో సేన్సోమ్బూన్సుక్ చేతిలో ఓడటంతో హైదరాబాద్ పాయింట్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సింధు 8-15, 9-15 తేడాతో మిషెల్లీ చేతిలో ఓడడంతో నార్త్ఈస్ట్ ముందంజ వేసింది.
పురుషుల డబుల్స్లో హైదరాబాద్ జంట బెన్ లేన్-ఇవనోవ్ 15-7, 15-10తో బోదిన్ ఇసారా-లీ యంగ్ డేపై సంచలన విజయం సాధించింది. ఇది నార్త్ ఈస్టర్న్కు ట్రంప్ మ్యాచ్ కావడంతో.. స్కోరు 1-1తో సమమైంది. నిర్ణయాత్మక ఆఖరి పురుషుల సింగిల్స్ మ్యాచ్లో డారెన్ ల్యూ 15-9, 15-10తో లి చక్ యుపై విజయంతో హంటర్స్ విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ శిబిరంలో ఆనందం వెల్లువిరిసింది. లక్నోలో జరిగిన గత మ్యాచ్లోనూ హైదరాబాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గురువారం మ్యాచ్లో చెన్నై సూపర్స్టార్స్తో పుణే సెవెన్ ఏసెస్ జట్టు తలపడుతుంది.