హైదరాబాద్: ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ నాలుగో సీజన్లో ఎట్టకేలకు పుణె 7 ఏసెస్ బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం సొంతగడ్డపై సినీ నటి తాప్సి యాజమానిగా ఉన్న పూణె.. తమ మూడో మ్యాచ్లో 4-3తో ముంబై రాకెట్స్ను కంగు తినిపించింది. పుణె ట్రంప్ మ్యాచ్గా ఎంచుకొన్న మహిళల సింగిల్స్ మ్యాచ్లో లైన్ హొమార్క్ 15-11, 15-7తో శ్రేయాన్షిపై గెలిచి జట్టుకు 2-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత పురుషుల డబుల్స్ మ్యాచ్లో ఇవనోవ్- చిరాగ్ జంట 15-14, 15-7తో లీ యంగ్- కిమ్ జంగ్ జోడీపై నెగ్గడంతో పుణె 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ముంబై ట్రంప్ మ్యాచ్లో లక్ష్యసేన్ (పుణే) 13-15, 15-7, 6-15తో అంటోన్సెన్ చేతిలో, రెండో మ్యాచ్లో హర్షిల్ (పుణే) 7-15, 10-15తో సమీర్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో 3-3తో స్కోరు సమమైంది. నిర్ణయాత్మక మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో ఇవనోవ్- లైన్ జోడీ 15-13, 11-15, 15-12తో జంగ్- బెర్నాడె ద్వయంపై గెలిచి పుణెకు విజయాన్ని అందించింది.
నార్త్ ఈస్టర్న్ వారియర్స్ 3-0తో ఢిల్లీ డాషర్స్పై నెగ్గింది. మహిళల సింగిల్స్లో రీతుపర్ణ (వారియర్స్) 15-13, 15-9తో కొసెట్స్కయాపై నెగ్గగా... పురుషుల డబుల్స్లో లియావో మిన్ చన్-సియాంగ్ (వారియర్స్) ద్వయం 15-9, 15-6తో చయ్ బియావో-సిజీ వాంగ్ జంటపై గెలిచింది. ఢిల్లీ ట్రంప్గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్లో సెన్సోబూన్సుక్ (వారియర్స్) 15-5, 15-12తో సుగియార్తోను, రెండో పోరులో టియాన్ హౌవీ (వారియర్స్) 12-15, 15-7, 15-14తో ప్రణయ్ను ఓడించారు.
చివరగా జరిగిన మిక్స్డ్ డబుల్స్ వారియర్స్ ట్రంప్ మ్యాచ్ కాగా... ఇందులో లియావో మిన్-కిమ్ హ న జంట 15-12, 7-15, 14-15తో జొంగ్జిత్-కొసట్స్కయ (ఢిల్లీ) జోడీ చేతిలో ఓడిపోయింది. ఆదివారం మ్యాచ్ల్లో చెన్నైతో అహ్మదాబాద్, బెంగళూరుతో పుణే తలపడతాయి.