
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ హంటర్స్ పోరాటం ముగిసింది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రాణించినా.. హైదరాబాద్ హంటర్స్ ఫైనల్కు చేరడంలో విఫలమైంది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ముంబై రాకెట్స్ 2-4తో ఓటమిపాలైంది.
ఈ విజయంతో ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరిన ముంబై.. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్లో బెంగళూరు రాప్టర్స్తో తలపడనుంది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్లో బొదిన్ ఇసారా-కిమ్ స రంగ్ (హైదరాబాద్) జోడీ 14-15, 12-15తో కిమ్ జీ జంగ్-లీ యంగ్ డే ద్వయం చేతిలో ఓడింది.
ఆ తర్వాత పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్ను ముంబై 'ట్రంప్'గా ఎంచుకోగా ఇందులో సమీర్ వర్మ 15-8, 15-7తో మార్క్ కాల్జౌ (హైదరాబాద్)ను ఓడించాడు. దీంతో హంటర్స్ 0-3తో వెనుకబడింది. ఈ దశలో హైదరాబాద్ హంటర్స్ 'ట్రంప్' అయిన మహిళ సింగిల్స్లో పీవీ సింధు 15-6, 15-5తో శ్రేయాన్షి పరదేశి (ముంబై)పై అలవోక విజయం సాధించింది.
తొలి గేమ్లో 7-6తో ముందంజ వేసిన సింధు ఇక వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా 8 పాయింట్లు సాధించి 15-6తో గేమ్ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్లో పవర్ఫుల్ స్మాష్లతో విరుచుకుపడిన సింధు 15-5తో గేమ్తోపాటు మ్యాచ్నూ నెగ్గింది. దీంతో హైదరాబాద్ 2-3తో మళ్లీ రేసులోకి వచ్చింది.
ఆ తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్లో ఆండ్రెస్ యాంటన్సెన్ చేతిలో లి హున్ ఓటమితో హైదరాబాద్ ఓడింది. దీంతో మ్యాచ్ ఫలితం తేలడంతో అప్రధానమైన మిక్స్డ్ డబుల్స్ను ఆడించలేదు. ఈ పోరులో సింధు ఒక్కతే విజయం సాధించగా... మిగతా షట్లర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఏ ఒక్కరూ ఒక్క గేమ్లో కూడా నెగ్గలేదు.