ఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటపై తనపై తీవ్ర ప్రభావం చూపిందని టోక్యో పారాలింపిక్స్ 2020 బ్యాడ్మింటన్ గోల్డ్ మెడలిస్ట్ ప్రమోద్ భగత్ తెలిపాడు. ప్రపంచ చాంపియన్షిప్ సహా ఎన్నో విజయాలకు సచిన్ కారణం అని పేర్కొన్నాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండడం ఎలానో తాను సచిన్ నుంచి నేర్చుకున్నానని ప్రమోద్ చెప్పాడు. ప్రపంచ చాంపియన్ అయిన భగత్ గతవారం టోక్యోలో జరిగిన ఎస్ఎల్ 3 క్లాస్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ ఆటగాడిని ఓడించడం ద్వారా పసిడి పతకం అందుకున్నాడు. డేనియల్ బెతెల్పై 21-14.21-17 తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ను దేశానికి అందించాడు.
IPL 2021 కామెంటరీ ప్యానెల్ ఇదే.. మరోసారి అతడికే నిరాశే! టీమిండియా మాజీలకు చోటు!!
బ్యాడ్మింటన్ ఫైనల్స్ హోరాహోరీగా సాగింది. ప్రమోద్ భగత్ నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ.. ఆట కొనసాగే క్రమంలో దూకుడును ప్రదర్శించాడు. రెండో గేమ్లో బెతెల్ అటాకింగ్ గేమ్ ఆడటం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో 8 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నాడు. అయినప్పటికీ అనూహ్యంగా పుంజుకున్న ప్రమోద్.. విజయం సాధించి దేశానికి స్వర్ణ పతకం అందించాడు. భగత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. దూరదర్శన్లో మ్యాచులు చూసేవాడిని. సచిన్ టెండూల్కర్ ప్రశాంతంగా కనిపించేవాడు. మైదానంలో అతడి ప్రవర్తన నన్ను ఆకట్టుకునేది. అది నాపై తీవ్ర ప్రభావం చూపింది' అని తెలిపాడు.
ఎప్పటినుంచో సచిన్ను తాను అనుసరించేవాడినని, అతడి క్రీడా స్ఫూర్తి తనపై చాలా బాగా పనిచేసిందని ప్రమోద్ భగత్ అన్నాడు. తాను ఆడడం ప్రారంభించిన తర్వాత సచిన్ పద్ధతినే పాటించేవాడనని పేర్కొన్నాడు. ప్రపంచ చాంపియన్షిప్ సహా ఎన్నో విజయాలకు అది కారణమైందని భగత్ చెప్పుకొచ్చాడు. 33 ఏళ్ల ప్రమోద్ భగత్ నాలుగేళ్ల వయసులో ఉండగా.. పోలియో బారినపడ్డాడు. అయినా ఎంతో దైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఆటపై మక్కువ పెంచుకుని అందులో రాణించాడు. అందుకు ఫలితమే గోల్డ్ మెడల్ దక్కింది.
టోక్యో పారాలింపిక్ 2020 క్రీడల్లో తొలిసారిగా రికార్డు స్థాయిలో 19 పతకాలు సాధించి భారత పతాకాన్ని టోక్యోలో రెపరెపలాడించారు మన అథ్లెట్లు. పారాలింపిక్స్లో పాల్గొన్న ఈ ఆటగాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని ప్రశంసించారు. ఆటగాళ్లతో ప్రధాని మోదీ క్రీడలలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడారు. ఈ సమయంలో ఆటగాళ్లు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. దాంతో ప్రధాని వారిలో మనోబలాన్ని పెంపొందించారు. మీరు చాలా కష్టపడ్డారు అని ధైర్యం చెప్పారు. అందరిని ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు.
వికలాంగ ఆటగాళ్ల గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ... 'వికలాంగ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే వారి శారీరక సామర్థ్యం మాత్రమే కాకుండా మానసికంగా సాధారణ ఆటగాడికి చాలా భిన్నంగా ఉంటారు. వారిని అర్థం చేసుకోవాలి. ఇలాంటీ క్రీడాకారుల కోసం వర్క్షాప్లు నిర్వహించాలి' అని అన్నారు. అనంతరం పారాలింపిక్ ఆటగాడు శరద్ పీఎం మోడీతో మాట్లాడుతూ.. 'నేను ఇప్పుడు తదుపరి ఆటను పూర్తి అభిరుచితో ఆడతాను. మీరు చెప్పినట్లు టెన్షన్, ఒత్తిడి తీసుకోకుండా గెలుపుపై దృష్టి సారిస్తా' అని చెప్పుకొచ్చాడు.