
హైదరాబాద్: కామన్ వెల్త్ క్రీడల్లో ప్రవేశం దొరకపోయినప్పటికీ అంతర్జాతీయ పోటీల్లో టైటిల్ సాధించేశాడు కశ్యప్. మూడు సంవత్సరాల నిరీక్షణ అనంతరం అతను ఈ టైటిల్ గెలుచుకోగలిగాడు. ఆస్ట్రియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్లో పురుషుల సింగిల్స్ విభాగంలో ఛాంపియన్గా నిలిచాడు. శనివారం రాత్రి జరిగిన ఈ పోటీలో ఆతిథ్య దేశపు ఆటగాడిపై విజయాన్ని నమోదు చేశాడు.
హైదరాబాదీ స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ ఆస్ట్రియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను గెలుచుకోగలిగాడు. ఫైనల్లో కశ్యప్ 21-18, 21-4తో ఐదో సీడ్ రౌల్ (ఎస్తోనియా)ను చిత్తు చేశాడు. మరోవైపు బాసెల్లో జరుగుతున్న స్విస్ ఓపెన్ టోర్నీలో యువ షట్లర్ సమీర్ వర్మ తుదిపోరుకు దూసుకెళ్లాడు. సెమీస్లో సమీర్ వర్మ 21-14, 11-21, 21-12తో కంతాపోన్ వాంగ్చారోన్ (థాయ్లాండ్)ను ఓడించాడు.
ఈ విజయం అనంతరం అతను మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. 'చాలా రోజుల తర్వాత ట్రోఫీ నెగ్గడం ఆనందంగా ఉంది. ఈ విజయం వెనుక కోచ్ గోపీచంద్, శిక్షణ సిబ్బంది కృషి ఎంతో ఉంది. ఈ విజయాలను ఇలాగే కొనసాగిస్తూ... టాప్-30లో చోటు సంపాదించడమే నా లక్ష్యం' అని ఈ హైదరాబాద్ ప్లేయర్ తెలిపాడు. మూడేళ్ల అనంతరం అంతర్జాతీయ టైటిల్ సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రపంచ 44వ ర్యాంక్ లో ఉన్న కశ్యప్ ఏప్రిల్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించలేదు. దీనిపై అతను స్పందిస్తూ.. 'గత ఏడాది కాలంగా శ్రీకాంత్, ప్రణయ్ అద్భుతంగా రాణిస్తున్నారు. వారు కామన్వెల్త్ గేమ్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హులు. వారు పతకాలతో తిరిగొస్తారని భావిస్తున్నాను' అని తెలిపాడు.