న్యూఢిల్లీ: భారత్ ఏసి డబుల్ షట్లర్ జ్వాలా గుత్తా గురువారం నాడు క్రీడా మంత్రిత్వ శాఖ తీరు పైన తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)లో లెక్కలోకి తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
జ్వాలా గుత్తా 2011లో అశ్విని పొన్నప్పతో కలిసి వరల్డ్ ఛాంపియన్ షిప్లో కాంస్య పతకం గెలుచుకున్నారు. దేశం కోసం ఆడుతున్న తనను ఈ పథకం కింద నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆమె అన్నారు.
తనతో పాటు అశ్విని పేర్లు 'టాప్'లో లేవని తాను దినపత్రికలలో చదివానని చెప్పారు. కార్పోరేట్ సపోర్ట్ ఉన్న వారి పేర్లు 'టాప్' లిస్టులో ఉన్నాయని, తన పేరు, అశ్విని పేరు మాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదన్నారు. తాను తీవ్ర నిరాశకు లోనయ్యానని చెప్పారు.
తాము తమ అత్యున్నతంగా ఆడేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంచనాలకు అందని రీతిలో ఆడుతున్నామన్నారు. కానీ, ఇలాంటి సంఘటనలు తమను అసంతృప్తికి గురి చేస్తున్నాయన్నారు. ఇలా జరుగుతుంటే మేం ఎలా ముందుకు వెళ్లగలమని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, 'టాప్' పథకం కింద మెడల్స్ సంపాదించిన వారిని గుర్తించి, 2016 ఒలింపిక్స్కు సిద్ధం చేసేందుకు, వారికి పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు సమకూర్చుతుంది. ఈ క్రీడల్లో బ్యాడ్మింటన్ కూడా ఉంది.