హైదరాబాద్: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో రజతం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు మరో కీలక టోర్నీకి సిద్ధమైంది. ఈ ఏడాది ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్, థాయ్లాండ్ ఓపెన్, ప్రపంచ చాంపియన్షిప్, ఆసియా క్రీడల్లో రన్నరప్గా నిలిచిన సింధు మంగళవారం నుంచి మొదలయ్యే జపాన్ ఓపెన్లో బరిలోకి దిగుతోంది.
కామన్వెల్త్, ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియా క్రీడల ఫైనల్లో ఓడిన సింధు తుదిపోరు ఆటంకాన్ని దాటాలన్న లక్ష్యంతో మంగళవారం నుంచి ఆరంభం కానున్న జపాన్ ఓపెన్ బరిలో దిగుతోంది. సింధు అద్భుత ఫామ్లో ఉన్నప్పటికీ ఫైనల్ మ్యాచ్ పరాజయాలే ఆమెను నిరాశకు గురి చేస్తున్నాయి. ఈ టోర్నీలో టైటిల్ నెగ్గి.. విజయాల బాట పట్టాలని భావిస్తోంది. సింధు.. తొలి రౌండ్లో జపాన్ షట్లర్ సయాక తకహషితో తలపడనుంది.
'ఈ సారి పతకాలతోనే తిరిగొస్తాం'
క్వార్టర్స్లో సింధుకు కరోలిన మారిన్ లేదా యమగూచి ఎదురయ్యే అవకాశం ఉంది. సైనా ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. పురుషుల సింగిల్స్లో మాజీ నంబర్వన్ కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఏడాది అంతగా ప్రభావం చూపని శ్రీకాంత్ తొలి రౌండ్లో హూంగ్ (చైనా)తో తలపడనున్నాడు. జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)తో మ్యాచ్తో ప్రణయ్ టోర్నీని ఆరంభిస్తాడు.
తాజాగా హైదరాబాద్ ఓపెన్ నెగ్గి జోరు మీదున్న సమీర్ వర్మ కూడా బరిలో దిగనున్నాడు. సాయి ప్రణీత్ టోర్నీలో పాల్గొనట్లేదు. పురుషుల డబుల్స్లో సాత్విక్- చిరాగ్, మను అత్రి- సుమీత్ రెడ్డి, మహిళల డబుల్స్లో అశ్విని- సిక్కిరెడ్డి, మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్- సిక్కిరెడ్డి, సాత్విక్- అశ్విని పోటీపడనున్నారు.