'నేనేమీ సెహ్వాగ్, వార్నర్ కాదు.. వారిలా ఆడలేనని నాకు తెలుసు'
కరోనా వేగంగా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ఎలా ప్రాక్టీస్ చేయమంటారని కశ్యప్ ట్విట్టర్ వేదికగా ఐఓసీని ప్రశ్నించాడు. 'ప్రాక్టీస్ కొనసాగించమని ఐఓసీ మమ్మల్ని ప్రోత్సహిస్తోంది. కానీ.. ఎలా? ఎక్కడ?. ఐఓసీ.. మీరు జోక్ చేస్తున్నారా?' అని 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ పేర్కొన్నాడు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భారత షట్లర్లందరూ ప్రాక్టీస్ చేసే గోపీచంద్ అకాడమీ ఈనెల 31 వరకు మూసేశారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ కొనసాగించండి ఐఓసీ అని అనడంలో అర్థం లేదని కశ్యప్ అన్నాడు.
'అసలు ఒలింపిక్స్కు అర్హత ఎవరు సాధించారనే దానిపై స్పష్టత లేదు. ముందే అర్హత పొందిన క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు అకాడమీలు అందుబాటులో లేవు. అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విదేశాల నుంచి వచ్చిన ఆటగాళ్లంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయండి అనడంలో అర్థం లేదు' అని కశ్యప్ పేర్కొన్నాడు.
కరోనా వైరస్ సంక్షోభం పెరుగుతుండడంతో టోక్యో ఒలింపిక్స్ను వాయిదా వేయడమే మంచిదని బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ఐవోసీ త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తే అందరూ కాస్త ఉపశమనం తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నాడు. 'ఒలింపిక్స్ నిర్వహణపై నాకు అనుమానాలు ఉన్నాయి. విశ్వక్రీడలకు ఎక్కువ సమయం లేదు. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఐవోసీ వెంటనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం ఆరోగ్యంపై ఆందోళనలు, ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. ప్రపంచమంతా ఆరోగ్యం, ప్రజల రక్షణ గురించి ఆలోచిస్తున్నది. అందుకే ఈ పరిస్థితుల్లో ఒలింపిక్స్ను వాయిదా వేయడమే ఉత్తమం' అని గోపీచంద్ పేర్కొన్నాడు.
IOC is encouraging us to continue training .. and how ? Where ? Ur joking right 🤔🤔🤷🏻♂️ https://t.co/xQIY7LEuoK
— Parupalli Kashyap (@parupallik) March 18, 2020
ఓ వైపు కరోనా ప్రభావం ఉన్నా.. షట్లర్ల ఆరోగ్యాలను ఫణంగా పెట్టి బర్మింగ్హామ్లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ నిర్వహించడం బీడబ్ల్యూఎఫ్ చేసిన తప్పిదమని గోపీచంద్ అన్నాడు. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ గడువు పొడగింపు అంశం సంక్లిష్టంగా ఉందని, అయితే అందరికీ సమాన అవకాశాలు వచ్చేలా బీడబ్ల్యూఎఫ్ చర్యలు తీసుకోవాలన్నాడు. ప్రస్తుతం షట్లర్లు ఇంట్లోనే ఉంటూ ఫిట్నెస్పై దృష్టిసారించాలని గోపీచంద్ సూచించాడు.