హైదరాబాద్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అంపైర్, మ్యాచ్ రిఫరీ వేమూరి సుధాకర్ కరోనాతో మంగళవారం ఉదయం మృతి చెందారు. 72 ఏళ్ల సుధాకర్ వరల్డ్ బ్యాడ్మింటన్లో మేటి అంపైర్గా పేరు తెచ్చుకున్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్)లో టాప్ అధికారుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన వరుసగా మూడు ఒలింపిక్స్(1992 బార్సిలోనా, 1996 అట్లాంటా, 2000 సిడ్నీ)లో మ్యాచ్ అఫిషియల్గా పనిచేసిన ఏకైక భారతీయుడిగా రికార్డు సృష్టించారు.
మూడు థామస్ అండ్ ఉబర్ కప్లలో, రెండు ఆసియా క్రీడల్లో, మూడు ప్రపంచకప్లలో అంపైర్గా వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పుల్లెల గోపీచంద్, గుత్తా జ్వాల, సైనా నెహ్వాల్, పి.వి.సింధు వంటి ఎంతోమంది క్రీడకారులకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు.
ఆటకు సుధాకర్ అందించిన సేవలకు గాను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆయనను జీవత సాఫల్య పురస్కారంతో గౌరవించింది. ప్రస్తుతం బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
1949లో జన్మించిన సుధాకర్ హైదరాబాద్లోని మెథడిస్ట్ బాలుర హైస్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. నిజాం కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. పలు సంస్థల్లో ఉద్యోగం చేసిన సుధాకర్ ఆటపై మక్కువతో బ్యాడ్మింటన్ వైపు మళ్లారు.
సుధాకర్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు.. మంత్రి కేటీఆర్, నేషనల్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, నేషనల్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి ఇండియన్ బ్యాడ్మింటన్కు తీరని లోటు అన్నారు. సుధాకర్ మృతి పట్ల షట్లర్లు గుత్తా జ్వాల, పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్ సంతాపం తెలిపారు.