హైదరాబాద్: ఆగస్టు 18 నుంచి 28 వరకు ఇండోనేసియాలోని జకార్తా వేదికగా జరుగనున్న ఆసియా గేమ్స్ కోసం 20 మంది క్రీడాకారులతో కూడిన భారత జట్టును బుధవారం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రకటించింది.
ఈ జాబితాలో ఆరుగురు యువ ప్లేయర్లకు బాయ్ చోటు కల్పించింది. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి గోపీచంద్ కూడా ఆసియా గేమ్స్కు ఎంపికైంది. భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్లతో సహా గాయత్రి గోపీచంద్ ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది.
బెంగళూరు, హైదరాబాద్లలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నీల్లో ప్రదర్శన ఆధారంగా ఆరుగురు యువ ప్లేయర్లకు భారత జట్టులో చోటు కల్పించింది. ర్యాంకింగ్ టోర్నీల్లో ప్రదర్శన, ఫిట్నెస్, కోచ్ల నివేదిక ఆధారంగా గాయత్రి గోపీచంద్, సౌరభ్వర్మ, అష్మిత, సాయి ఉత్తేజితారావు, ఆకర్షి కశ్యప్, రుతుపర్ణ, ఆర్తిలను ఎంపిక చేసినట్లు బాయ్ పేర్కొంది.
సెలక్షన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్లో గాయత్రి గోపీచంద్, అష్మిత, రుతుపర్ణ, ఆర్తి అద్భుత ప్రదర్శన చేసినట్లు బాయ్ వెల్లడించింది. 20 మంది క్రీడాకారుల్లో తెలుగమ్మాయి గాయత్రి గోపీచంద్ అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె వయస్సు 15. భారత సీనియర్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించబోతుండటం ఆమెకు ఇదే తొలిసారి.
"ఇటీవల ముగిసిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేసింది. క్రీడాకారుల ప్రస్తుత ఫామ్ను దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేశాం. ఈ విధంగా పారదర్శకతకు పెద్దపీటవేశాం. కొత్తగా ప్రతిభావంతులను గుర్తించాం" అని బాయ్ జనరల్ సెక్రటరీ అజయ్ కే సింఘానియా తెలిపారు.
The much awaited names of the 20 member strong #AsianGames2018 Badminton squad is out!🏸🇮🇳💪👍
— BAI Media (@BAI_Media) June 27, 2018
7 shuttlers have been selected based on the Qualification tournament performances of which six of them will represent India for the first time. #IndiaontheRise pic.twitter.com/8BNIhbNx80
బెంగళూరు వేదికగా జరిగిన టోర్నీలో మహిళల డబుల్స్ టోర్నీలో రుతుపర్ణ-ఆర్తిల జోడీ టైటిల్ విజేతగా నిలిచారు. హైదరాబాద్లో జరిగిన టోర్నీలో ఈ జోడి సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. ఈ ఇద్దరూ కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం సాధించిన అశ్విని పొన్నప్ప-సిక్కీ రెడ్డి జోడీతో కలిసి త్వరలో ప్రాక్టీస్ చేయనున్నారు. బెంగళూరులో సమావేశమైన సెలక్షన్ కమిటీ ఆటగాళ్ల ఫిట్నెస్ను కూడా పరిగణనలోకి తీసుకుంది.
ఆసియా గేమ్స్కు భారత జట్టు:
సైనా నెహ్వాల్, పీవీ సింధు, సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప, సాయి ఉత్తేజితారావు, అష్మిత, రుతుపర్ణ, ఆర్తి, ఆకర్షి, గాయత్రి, శ్రీకాంత్, ప్రణయ్, సాయి ప్రణీత్, సమీర్వర్మ, సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి, సుమీత్రెడ్డి, మను అత్రి, ప్రణవ్ చోప్రా, సౌరభ్వర్మ.
కోచ్లు: పుల్లెల గోపీచంద్, టాన్ కిమ్ హెర్, అరుణ్ విష్ణు, ఎడ్విన్
సహాయక సిబ్బంది: గాయత్రి శెట్టి, క్రిస్టోఫర్, కిరణ్, అరవింద్.