కల నెరవేరింది:
సింధు మాట్లాడుతూ... 'ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూసా. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. 2 కాంస్యాలు.. 2 రజతాల తర్వాత చివరికి స్వర్ణం సాధించా. ఇపుడు గర్వంగా ఉంది. కోచ్ గోపీ సర్, కిమ్ల సహకారంతోనే ఈ పతకం సాధ్యమైంది. అందరం చాలా కష్టపడ్డాం. 2017, 2018లలో రజతాలు సాధించినా.. ఇంకా ఏదో వెలితిగా అనిపించింది. వచ్చేసారి తప్పకుండా స్వర్ణం గెలవాలని నిశ్చయించుకున్నా. లక్ష్యం నెరవేరినందుకు ఆనందంగా ఉంది' అని సింధు తెలిపింది.
ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడా:
'గతంలో ఎదురైన ఓటములపై సమీక్ష చేసుకున్నా. స్వర్ణం గెలువాలని ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు. ప్రతిసారి ఒకే గేమ్ ప్లాన్ పనిచేయదు. ఓడిపోయిన ప్రతిసారి మనల్ని మనం సమీక్ష చేసుకుని ముందుకు సాగాలి. ఫైనల్ను కూడా మిగతా మ్యాచ్ల్లాగే ఆడాలనుకున్నా. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడా. దీంతో ఒకుహరా ఒత్తిడికిలోనైంది. ఇదే ప్రదర్శనను రానున్న టోర్నీల్లోనూ కొనసాగిస్తా. ఈ యేడాది చాలా కీలకమైంది' అని సింధు పేర్కొంది.
లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్సే:
'టోక్యో (2020) ఒలింపిక్స్కు అర్హత టోర్నీలు జరుగనున్నాయి. ఒలింపిక్స్ లాంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో రాణించాలంటే.. మరింత కష్టపడాలి. ఒలింపిక్స్కు మరో 11 నెలల సమయముంది. ప్రపంచ టోర్నీ పతకం ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఒలింపిక్స్లో రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగుతా. ఇక నా లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్సే. అంతకుముందు సూపర్ సిరీస్లలో కూడా గెలవాలి' అని సింధు అన్నారు.
కొత్త వ్యూహాలపై దృష్టి సారించాలి:
'మహిళల సింగిల్స్ చాలా మారిపోయింది. ప్రతి టోర్నీ హోరాహోరీగా సాగుతుంది. ప్రతి క్రీడాకారిణి భిన్నంగా ఆడుతుంది. ఒక్కో టోర్నీ తర్వాత క్రీడాకారిణుల శైలి మారుతుంది. ప్రత్యర్థుల ఆటతీరుకు అనుగుణంగా కొత్త వ్యూహాలపై దృష్టి సారించాలి. దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నా. టాప్-10లో ఉన్న క్రీడాకారిణుల ఆట మరికొరికి తెలుసు. ఒలింపిక్స్ కోసం మరింత కష్టపడి సరికొత్త వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి' సింధు చెప్పుకొచ్చింది.
ప్రణీత్ ప్రతిభకు నిదర్శనం:
'36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్లో సాయి ప్రణీత్ పతకం గెలిచాడు. చాలా సంతోషం. మెరుగైన ప్రత్యర్థులను ఓడిస్తూ ప్రణీత్ కాంస్యం దక్కించుకోవడం అతని ప్రతిభకు నిదర్శనం. రాబోయే టోర్నీల్లో సత్తాచాటేందుకు అతడికి ఆత్మవిశ్వాసం లభించింది. ప్రపంచ చాంపియన్గా నిలువడం వెనుక సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నిరంతరం వెన్నుతట్టి ప్రోత్సహించిన కోచ్ గోపీ అన్న, తల్లిదండ్రులు, కోచ్ కిమ్, ఫిట్నెస్ ట్రైయినర్ ప్రతి ఒక్కరికి కృతజ్ఙతలు' అని సింధు పేర్కొంది.