
హైదరాబాద్: శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ 'దిశ' హత్యాచారం కేసుకు పోలీసులు శుక్రవారం ముగింపు పలికారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్న కేశవులను శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
దిశ నిందితులు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుండి కీలక ఆధారాలు సేకరిస్తున్న క్రమంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పారిపోతున్న నలుగురు నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
దిశను ఎక్కడైతే నిందితులు అత్యంత క్రూరంగా హత్యాచారం చేశారో అదే ప్రాంతంలో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేయడం విశేషం. పోలీసులు ఎన్కౌంటర్పై అటు ప్రజల నుంచి ఇటు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో #Encounter #JusticeForDisha హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ అవుతున్నాయి.
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన ట్విట్టర్లో "గ్రేట్ వర్క్ హైదరాబాద్ పోలీసు. వుయ్ సల్యూట్ యు" అంటూ కామెంట్ పెట్టారు. కేంద్ర మాజీ మంత్రి, ఏథెన్స్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రాజ్యవర్థన్సింగ్ రాథోడ్ కూడా హైదరాబాద్ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు.
తన ట్విట్టర్లో "హైదరాబాద్ పోలీసులకు ఇవే నా అభినందనలు. పోలీస్ పవర్ను, నాయకత్వాన్ని చూపెట్టారు. చెడుపై మంచి సాధించిన విజయం అని దేశ ప్రజలు తెలుసుకోవాలి" అంటూ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్వీట్ చేశారు.
మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన ట్వీటర్ "ఇది భవిష్యత్ రేపిస్టులను ఆపుతుందా ?? ఒక ముఖ్యమైన ప్రశ్న... ప్రతి రేపిస్టును ఒకే విధంగా చూస్తారా ... వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా?!" అంటూ ప్రశ్నించారు.
దిశ హత్యాచారం నిందితుల మృతదేహాలకు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే శవపంచనామా నిర్వహించారు. స్థానిక మెజిస్ట్రేట్ సమక్షంలో శవపంచనామా పూర్తి చేశారు. తొలుత శవపరీక్షలు కూడా అక్కడే నిర్వహించాలనుకున్న పోలీసులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. మృతదేహాలను మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించి అక్కడే శవపరీక్షలు నిర్వహించనున్నారు.
దిశ హత్యాచార ఘటనలో నిందితుల్ని ఎన్కౌంటర్ చేయడంపై భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ట్విట్టర్లో "వెల్డన్ తెలంగాణ సీఎం- వెల్డన్ తెలంగాణ పోలీస్. మీరు ఏదైతే చేశారో అది కచ్చితంగా అభినందనీయమే" అంటూ ట్వీట్ చేశాడు.