
ప్రతిపాదనలు ఏమిటంటే:
బ్యాడ్మింటన్లో స్కోరింగ్ విధానాన్ని మార్చడం, మ్యాచ్ సందర్భంగా కోర్టులో కోచింగ్ సమయాన్ని తగ్గించడం వంటి ప్రతిపాదిత కొత్త విధానాలపై స్టార్ షట్లర్ హెచ్ఎస్. ప్రణయ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మార్పుల వల్ల బ్యాడ్మింటన్ వాణిజ్య విలువను పెంచాలనే లక్ష్యం నెరవేరదని అతనన్నాడు.

గ్యాప్ ఉండాల్సిందే:
మ్యాచ్లో 11 పాయింట్ల తర్వాత, ప్రతి గేమ్ తర్వాత ఉండే కోర్టు కోచింగ్ సమయాన్ని తగ్గించాలని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కౌన్సిల్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అంతే కాకుండా మ్యాచ్లో... పాయింట్ల మధ్య, వార్మప్ చేసేందుకు, రాకెట్ను పరిశీలించుకునే సమయాన్ని కూడా తగ్గించాలని ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది.

ఊపిరి తీసుకోవడం కూడా కష్టం:
బ్యాడ్మింటన్ చాలా వేగవంతమైన క్రీడ. మ్యాచ్లో ఆటగాడికి తగినంత సమయం లేకపోతే ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. అంతే కాకుండా చెమటను తుడుచుకోవడానికి, కోర్టు బయటకు వెళ్లి నీళ్లు తాగడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. మన గురించి పూర్తిగా తెలిసిన కోచ్ మన పక్కన ఉండి చెప్పడం అవసరం. ఈ కొత్త విధానాలన్నీ ఆటగాళ్లకు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రణయ్ తెలిపాడు.

ఐదు గేమ్ల మ్యాచ్ ఆడించాలని:
ప్రస్తుతం ఉన్న.. 21 పాయింట్ల మూడు గేమ్ల విధానాన్ని మార్చి 11 పాయింట్ల చొప్పున ఐదు గేమ్ల మ్యాచ్ ఆడించాలని బీడబ్ల్యూఎఫ్ ఆలోచిస్తోంది. స్కోర్ల విధానంలో మార్పు వల్ల ఫిట్గా లేని ఆటగాళ్లకు లాభం చేకూరే అవకాశం ఉందని ప్రణయ్ అన్నాడు.

శారీరకంగా ఫిట్గా లేని ఆటగాళ్లు:
నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే 21 పాయింట్ల గేమ్ విసుగు లేనపుడు మార్పులు చేయడం ఎందుకు? శారీరకంగా ఫిట్గా లేని ఆటగాళ్లు కొత్త విధానం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ మార్పు వల్ల వచ్చే కొన్నేళ్లలో ఇప్పటివరకూ తొలి 30 స్థానాల్లో లేని ఆటగాళ్లు అనూహ్యంగా ఉత్తమ ర్యాంకులు సాధిస్తారని అనుకుంటున్నా.

ఆదరణ పెంచేలా చూడాలి:
ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగే టెన్నిస్ మ్యాచ్ అభిమానులను అలరించినపుడు.. కేవలం 90 నిమిషాల్లో ముగిసే బ్యాడ్మింటన్ మ్యాచ్ను ఎందుకు చూడరు. విధానాలు, నియమాలు మార్చడం కాదు ఆట పట్ల ఆదరణ పెంచేలా చూడాలి'' అని ప్రణయ్ వివరించాడు. కాలికి పులిపిర్ల కారణంగా ఈ సీజన్లో ప్రణయ్ చాలా మ్యాచ్లు ఆడలేదు. ఫిబ్రవరి మొదట్లో చికిత్స చేయించుకున్న ప్రణయ్... మార్చి 14న ఆరంభమయ్యే ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ కోసం సాధన మొదలెట్టాడు.


Click it and Unblock the Notifications












