నేను చాలా విమర్శలు ఎదుర్కొన్నాను
కామన్వెల్త్లో స్వర్ణం గెలిచిన అనంతరం సైనా నెహ్వాల్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నేను చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. అయితే, అవి నాకు మంచే చేశాయి. చెప్పాలంటే.. ఆ విమర్శలే నా బలహీనతల్ని సరిదిద్దుకునేందుకు ఉపయోగపడ్డాయి. నా ఫిటెనెస్ని మెరుగుపర్చుకుని.. కామన్వెల్త్లో బంగారు పతకం గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది' అని సైనా నెహ్వాల్ వెల్లడించింది.
కామన్వెల్త్ గేమ్స్ అనేది ప్రతిష్టాత్మక టోర్నీ
'కామన్వెల్త్ గేమ్స్ అనేది ప్రతిష్టాత్మక టోర్నీ. ప్రతి ఒక్కరూ దేశం కోసం గెలవాలని కోరుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఆశలు వదులుకోను.. పోరాడుతాను. ఈ వారంలో జరగనున్న మరో టోర్నీలో కూడా గెలిచి నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నా. అంతేకాకుండా ఈ ఏడాదంతా ఫిటెనెస్పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తా' అని సైనా తెలిపింది.
పీవీ సింధుతో పోరు చాలా కఠినంగా అనిపించింది
‘ఈ టోర్నీలో పోటీపడిన టాప్-15 మంది షట్లర్లు చాలా చురుకైనవారు. ఆరంభం నుంచి ఫిటెనెస్, ఆత్మవిశ్వాసంతో కనిపించారు. అందుకే పోటీలు చాలా కఠినంగా సాగాయి. నా వరకూ తీసుకుంటే.. సెమీ ఫైనల్లో క్రిస్టీతో మ్యాచ్.. ఫైనల్లో పీవీ సింధుతో పోరు చాలా కఠినంగా అనిపించింది. నా ఆట మెరుగుకి కారణం కోచ్ గోపీ సార్, ఫిజియో క్రిస్టోఫర్. నేను కాలి గాయం నుంచి వేగంగా కోలుకునేందుకు క్రిస్టోఫర్ సాయం అందించారు' అని సైనా చెప్పుకొచ్చింది.
తండ్రి హర్వీర్సింగ్కు మద్దతుగా
ఇక, తన తండ్రి హర్వీర్సింగ్కు మద్దతుగా నిలిచేందుకు పోరాటం చేయడానికి ఎన్నడూ తాను సంకోచించనని సైనా నెహ్వాల్ వెల్లడించింది. తన తండ్రి కామన్వెల్త్ క్రీడలు వీక్షించేందుకు గోల్డ్ కోస్ట్ చేరుకున్నపుడు క్రీడా గ్రామంలోకి అనుమతించకపోవడంతో సైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఈ సందర్భంగా సమర్దించుకుంది.
వ్యక్తిగత కోచ్గా అక్రిడిటేషన్ ఇస్తామని చెబితేనే గోల్డ్కోస్ట్కు
దేశానికి పతకాలు సాధించడంకంటే తన తండ్రికే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని పలువురు వ్యాఖ్యానించడంపై సైనా స్పందించింది. అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపి తీరా తన తండ్రి ఇక్కడకు వచ్చిన తర్వాత పాస్ ఇవ్వకుండా ఏకాకిని చేయడం ఎంతవరకు సబబని సైనా ప్రశ్నించింది. తన తండ్రికి వ్యక్తిగత కోచ్గా అక్రిడిటేషన్ ఇస్తామన్న చెబితేనే సొంత ఖర్చులతో ఇక్కడకు రప్పించానని, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని వివరించింది.
ఆ సంఘటనతో ఎంతో కలత చెందా
తాను అలా మాట్లాడి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేదని సైనా ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సంఘటనతో తాను ఎంతో కలత చెందానని, సరైన విశ్రాంతి కూడా తీసుకోలేకపోయానని, అయినా పతకాలు సాధించడంలో శక్తి మేరకు శ్రమించానని చెప్పింది. కామన్వెల్త్లో సైనా మహిళల సింగిల్స్, టీమ్ విభాగాలలో స్వర్ణాలు సాధించిన సంగతి తెలిసిందే.