
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త క్యాంపెయిన్ #BharatKiLaxmiకి బ్రాండ్ అంబాసిడర్లుగా స్టార్ షట్లర్ పీవీ సింధు, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె వ్యవహరించనున్నారు. మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ దీపావళిని "భారత్ కీ లక్ష్మీ" పేరుతో జరుపుకుందాని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' ద్వారా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా వీరిద్దరితో కలిపి రూపొందించిన #BharatKiLaxmi ప్రమోషన్ వీడియోని పీవీ సింధు తన ట్విట్టర్లో షేర్ చేస్తూ "మహిళలకు సరైన సాధికారత లభించి వాళ్లు సాధించిన ఘనతలకు సముచిత స్థానం లభించినప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది. నేను ప్రధాని మోడీకి, భారత్ కీ లక్ష్మీకి మద్దతు ఇస్తున్నా. భారత్లోని అసాధారణ మహిళలు సాధించిన అసాధారణ ఘనతలతో పండగ చేసుకుందాం" అని కామెంట్ పెట్టింది.
మనకు దగ్గరలోని మహిళలు సాధించిన ఘనతలను #BharatKiLaxmi అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రధాని మోడీ సైతం కోరారు. ఈ వీడియోపై ప్రధాని మోడీ తన ట్విట్టర్లో "మన సంస్కృతి మహిళా సాధికారత ఎలా సాధించాలో ఎప్పటి నుంచో చెబుతూ వస్తుంది. ఈ వీడియో ద్వారా పీవీ సింధు, దీపికా పదుకొనేలు భారత్ కీ లక్ష్మీ గురించి అద్భుతంగా తెలియజేశారు" అని ట్వీట్ చేశారు.