
హైదరాబాద్: భారత షట్లర్ సైనా నెహ్వాల్ కామన్వెల్త్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనాతో కలిసి గోల్డ్కోస్ట్ వెళ్లిన తన తండ్రి హర్వీర్ సింగ్ని క్రీడా గ్రామంలోకి అనుమతించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో వరుస ట్వీట్లతో ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది.
'కామన్వెల్త్ గేమ్స్కు వెళ్లే ముందు మా నాన్న పేరు.. జట్టు అధికారిగా జాబితాలో ఉంది. టీమ్ అధికారిగా మా నాన్నను అధికారికంగా ధ్రువీకరించడంతో నేనే ఆయన ఖర్చులన్నీ భరించాను. కానీ క్రీడాగ్రామం దగ్గరకు వచ్చేసరికి ఆయన పేరును అధికార్ల జాబితా నుంచి తొలగించేశారు. ఇప్పుడాయన నాతో ఉండడానికి వీల్లేదు. నా మ్యాచ్లనూ చూడలేరు. క్రీడాగ్రామంలోకీ ప్రవేశించలేరు. నన్ను కలవలేరు. ఇది ఏ రకమైన సహకారం' అని సైనా ట్వీట్ చేసింది.
'నాకు నాన్న మద్దతు కావాలి. అందుకే రెగ్యులర్గా నా మ్యాచ్లకు ఆయనను తీసుకెళుతుంటాను. కానీ, ఆయనకు ఇక్కడ ప్రవేశం ఉండదని ముందే నాకు ఎందుకు చెప్పలేదో అర్థం కావడం లేదు' అని సైనా నిర్వేదం వ్యక్తం చేశారు.
కామన్వెల్త్ గేమ్స్కు ముందు క్రీడాకారులతో కుటుంబ సభ్యులు ఎందుకు అంటూ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపకపోవడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పీవీ సింధు వాళ్ల అమ్మ, సైనా వాళ్ల నాన్నకు అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా బుధవారం నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
మొత్తం 11 రోజుల పాటు జరిగే ఈ గేమ్స్లో బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్ లాంటి క్రీడల్లో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. పోటీకి దిగారంటే పతకం ఖాయం అనుకున్న వారిలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, స్టార్ బాక్సర్ మేరీకోమ్, వెయిట్లిఫ్టర్ సంజీతా చాను, యువ షూటర్ మెహులీ ఘోష్, ఏస్ బాక్సర్ వికాస్ క్రిషన్ ముందు వరుసలో ఉన్నారు.