న్యూఢిల్లీ: స్పెయిన్ బ్యాడ్మింటన్ స్టార్, రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్.. టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలిగింది. ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న ఆమెకు ఈ వారం చివర్లో సర్జరీ జరగనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ స్పెయిన్ స్టారే ట్విటర్ వేదికగా వెల్లడించింది. సమ్మర్ గేమ్స్కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నా.. గాయం నుంచి కోలుకోని ఫిట్నెస్ సాధించడం కష్టమని తెలిపింది.
'పలు పరీక్షలు, డాక్టర్ కనసల్టేషన్ తరువాత నా ఎడమ మోకాలి లిగ్మెంట్లో చీలిక వచ్చినట్లు తేలింది. దాంతో సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీకెండ్లో నాకు సర్జరీ జరుగుతుంది. ఈ కఠిన సమయంలో నాకు అండగా నిలుస్తూ మెసేజ్లు పంపించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇది నాకు మరో ఎదురుదెబ్బ. దీన్ని నేను అధిగమించి అతి త్వరలో మీ ముందుకు వస్తాను. ఈ సమస్యతోనే గత రెండు నెలలుగా ప్రాక్టీస్ చేయడం కష్టంగా మారింది.
ఇక ఒలింపిక్స్ సమయానికి నేను ఫిట్ అవ్వడం కూడా కష్టమే. కానీ ఈ కఠిన సమయంలో నాకు అండగా చాలా మంది ఉన్నారని తెలుసు' అని కరోలినా మారిన్ పేర్కొంది. ఇక గత శుక్రవారం ప్రాక్టీస్ చేస్తుంటే కొంత అసౌకర్యానికి గురయ్యానని, దాంతో ట్రైనింగ్ను ఆపేసనని మారిన్ ట్వీట్ చేసింది.
2016 రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధును ఓడించిన కరోలినా మారిన్.. స్వర్ణ పతకం ఎగరేసుకుపోయింది. ఆ టోర్నీ తర్వాత జరిగిన పలు టోర్నీల్లో కూడా సింధుకు మారిన్ కొరకరాని కొయ్యలా మారింది. వరల్డ్ బ్యాడ్మింట్ చాంపియన్షిప్లో కూడా కరోలినా మారిన్ గైర్హాజరీలోనే సింధు గోల్డ్ మెడల్ గెలిచింది. మరీ ఈ సారి మారిన్ టోక్యో దూరమవుతున్న నేపథ్యంలో సింధుకు ఓ గండం తప్పినట్లే. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై సందిగ్ధత నెలకొనగా.. ఒకవేళ జరిగితే మాత్రం సింధుకు బంగారు పతకం అవకాశాలు మెరుగైనట్లే.
టోక్యో ఒలింపిక్స్కు ముందు క్వాలిఫైయింగ్ టోర్నీలు నిర్వహించబోమని గత శుక్రవారం బీడబ్ల్యూఎఫ్ స్పష్టంచేసింది. దాంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ టోక్యో ఒలిం పిక్స్ ఆశలకు తెరపడింది. నిబంధనల ప్రకారం సింగిల్స్లో టాప్-16 ర్యాంకింగ్స్లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి ఒలింపిక్స్లో నేరుగా పాల్గొనే అవకాశం లభిస్తుంది.
భారత్ నుంచి మహిళల సింగిల్స్లో పీవీ సింధు ఏడో ర్యాంక్లో... సైనా 22వ ర్యాంక్లో... పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్లో... శ్రీకాంత్ 20వ ర్యాంక్లో ఉన్నారు. దాంతో భారత్ నుంచి సింధు, సాయిప్రణీత్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత పొందారు. పురుషుల డబుల్స్లో ఎనిమిదో ర్యాంక్లో ఉన్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది.