సారీ.. సింధు.. మా తప్పును మన్నించు!

న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఆసియా బ్యాడ్మింటన్ టెక్నికల్ కమిటీ క్షమాపణలు చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆసియా ఛాంపియన్షిప్ సెమీఫైనల్లో రిఫరీ తప్పిదానికి కమిటీ ఛైర్మన్ చై షెన్ చెన్ క్షమాపణలు కోరుతూ సింధుకు లేఖ రాసారు. 'దురదృష్టవశాత్తు ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దలేం. మరోసారి ఇలాంటి మానవ తప్పిదం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నాం. మీకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. ఇది క్రీడల్లో భాగమని, దాన్ని మీరు అంగీకరిస్తారని నమ్ముతున్నాం' అని ఆ లేఖలో కమిటీ ఛైర్మన్ పేర్కొన్నారు.

అంపైర్ తప్పిదంతో..
జపాన్ స్టార్ షట్లర్ అకానె యమగూచితో జరిగిన మ్యాచ్లో అంపైర్ తప్పిదం కారణంగా సింధు ఒక పాయింటు కోల్పోయింది. సర్వ్ ఆలస్యమైన కారణంగా సింధుకు అంపైర్ ఒక పాయింటు కోత విధించాడు. ప్రత్యర్థి సిద్ధంగా లేదంటూ సింధు ఎంత వాదించినా ఫలితం లేకపోయింది. తొలి గేమ్ గెలిచి.. రెండో గేమ్లో 14-11తో సింధు ఆధిక్యంలో ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఏకాగ్రత కోల్పోయిన సింధు పరాజయం చవిచూసింది. కాంస్యంతో సరిపెట్టుకున్న సింధు.. మ్యాచ్ అనంతరం తనకు జరిగిన అన్యాయం పట్ల కన్నీళ్లు పెట్టుకుంది.

అన్యాయం జరిగిదంటూ..
'సర్వీస్ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటున్నావని రిఫరీ నాతో అన్నాడు. అయితే నేను సర్వీస్ చేసే సమయానికి ప్రత్యర్థి సిద్ధంగా లేదు. కానీ రిఫరీ నా మాటలు పట్టించుకోకుండా యమగూచికి పాయింట్ ఇచ్చాడు. ఇది అన్యాయం. సెమీఫైనల్లో ఓటమికి ఇదో కారణం. రెండో గేమ్లో 14-11తో ఆధిక్యంలో ఉన్నా. అలాగే జోరులో 15-11తో విజయానికి చేరవ అయ్యేదాన్ని. అనవసరంగా ఒక పాయింట్ కోల్పోవడంతో స్కోరు 14-12గా మారింది. రిఫరీ ఇచ్చిన ఆ పాయింట్ న్యాయమైంది కాదు.
ఈ మ్యాచ్లో నేను గెలిచి ఫైనల్కు వెళ్లాల్సింది. ఈ విషయంపై చీఫ్ రిఫరీకి కూడా ఫిర్యాదు చేశా. కానీ అప్పటికే రిఫరీ పాయింట్ ఇచ్చేశాడు కదా అన్నాడు. ఒక చీఫ్ రిఫరీగా అతడు కనీసం ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించాల్సింది" అని సింధు ఆ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పేర్కొంది. నాటి సెమీఫైనల్లో ఒలింపిక్ మెడలిస్ట్ సింధు 21-13, 19-21, 16-21 తేడాతో జపాన్ ప్లేయర్ యమగూచి చేతిలో ఓటమిపాలైంది.

మలేసియా మాస్టర్స్లో సింధు..
మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ ఏడాది రెండు సూపర్ 300 టోర్నీలు గెలిచిన ఆమె.. మలేసియా మాస్టర్స్ టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో సింధు ఏడో సీడ్గా బరిలో దిగుతుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హి బింగ్ జియావొ (చైనా)తో ఆమె తలపడనుంది.
ఇటీవల ఇండోనేసియా ఓపెన్లో తొలి రౌండ్లోనే సింధును బింగ్ జియావొ ఓడించింది. ఇప్పటి వరకు వీరిద్దరు 18 సార్లు తలపడగా.. సింధు ఎనిమిదింట్లో గెలవగా, ప్రత్యర్థి 10 మ్యాచ్ల్లో పైచేయి సాధించింది. తొలి రౌండ్, ప్రిక్వార్టర్స్ తర్వాత సింధుకు అసలైన సవాల్ ఎదురుకానుంది. క్వార్టర్స్లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడొచ్చు. గతవారం మలేసియా ఓపెన్ క్వార్టర్స్లో తై జు చేతిలోనే సింధుకు పరాజయం ఎదురైంది. సింధుపై ఆమెకు 16-5తో మెరుగైన గెలుపోటముల రికార్డు కూడా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications