
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్లు రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ఇటీవలే ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతం సాధించిన తెలుగు తేజం పీవీ సింధూకు వరల్డ్ నంబర్ 52వ ర్యాంకర్ వూ తి ట్రాంగ్ (వియత్నాం) గట్టి పోటీనిచ్చింది.
దీంతో అతి కష్టంమీద 21-10, 12-21, 23-21 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. తొలి గేమ్ను 21-10తో అలవోకగా గెలిచిన సింధూ రెండో గేమ్లో 12-21 తేడాతో ఓడిపోయింది. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్లో ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. తొలుత ఇద్దరూ 9-9తో సమానంగా నిలిచారు.
మూడో గెలవడం కోసం సింధు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రెండో గేమ్లో అనవసర తప్పిదాలు చేసి ఓడిన సింధు మూడో గేమ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఆడింది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 16-12తో ఆధిక్యంలో నిలిచింది. వెంటనే అనవసర తప్పిదాలతో మూడు పాయింట్లు కోల్పోయింది.
ఇద్దరూ 19-19తో సమంగా నిలవడంతో గేమ్ రసవత్తరంగా మారింది. 21-20 వద్ద సింధూ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. రెండో రౌండ్లో భాగంగా పీవీ సింధు ఇండోనేషియాకే చెందిన జార్జియా మరిస్కాతో తలపడనుంది.

మరోవైపు ఇరాన్ షట్లర్ సొరయాతో జరిగిన మరో మ్యాచ్లో సైనా నెహ్వాల్ అలవోక విజయాన్ని నమోదు చేసింది. 21-7, 21-9తో వరుస గేముల్లో చిత్తుగా ఓడించింది. మ్యాచ్ 26 నిమిషాల్లో ముగియడం విశేషం.