
హైదరాబాద్: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశంలోని సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు సింధును సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. సింధు విజయంపై తాము ఎంతో గర్వంతో ఉప్పొంగుతున్నామంటూ టాలీవుడ్ హీరో, హీరోయిన్లు ట్వీట్లు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నటి మంచు లక్ష్మీ, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, యంగ్ హీరో నాగశౌర్య, దర్శకుడు బాబీ తదితరులు సోషల్ మీడియా వేధికగా సింధుకు అభినందనలు తెలిపారు.
'మరో చారిత్రాత్మక విజయం. భారత్ అత్యుత్తమ విజయాల్లో ఇది ఒకటి. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు అభినందనలు. నాకు చాలా సంతోషంతో పాటు గర్వంగా ఉంది' అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. 'అభినందనలు ఛాంపియన్. చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా సింధూ చరిత్ర సృష్టించడం గర్వంగా ఉంది. త్వరగా వచ్చేయ్ .. పెద్ద వేడుక జరుపుకుందాం' అని మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది. 'ఒలింపిక్స్లో భారతీయ మహిళలు మెరుస్తూనే ఉన్నారు. పీవీ సింధుకు అభినందనలు. నువ్ మరిన్ని విజయాలు సాదించాలి' అని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీటింది.
'టోక్యో ఒలింపిక్స్ 2020లో దేశం కోసం కాంస్యం గెలిచిన పీవీ సింధుకు అభినందనలు. మీరు మమ్మల్ని మళ్లీ గర్వపడేలా చేసారు. మరిన్ని మెడల్స్ సాధించాలని కోరుకుంటున్నా' అని దర్శకుడు బాబీ ట్వీట్ చేశాడు. 'హ్యాట్సాఫ్ పీవీ సింధు. మీ శ్రమ మరియు అంకితభావానికి ప్రతిరూపం దక్కింది. మీ చారిత్రాత్మక విజయానికి నా హృదయపూర్వక అభినందనలు' అని హీరో నాగశౌర్య పేర్కొన్నాడు. ఆదివారం హి బింగ్జియావో ( చైనా)తో జరిగిన మ్యాచ్లో 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్లో గెలిచి సింధు కాంస్య పతకం సాధించింది.
తమ కూతురిని చూసి సింధు తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగుతున్నారు. సింధు విజయంపై ఆమె తండ్రి పీవీ రమణ స్పందించారు. 'శనివారం సెమీస్ మ్యాచ్లో ఓడిన తర్వాత నేను సింధుతో మాట్లాడా. గెలవమని చెప్పాను. నా కోసం గెలవమని చెప్పాను. సింధు కంట్లో నీళ్లు చూశాను. అయితే ఆమె ప్రత్యర్థి బింగ్జియావో సుదీర్ఘ గేమ్స్ ఆడుతోందని, ఆమె ఎక్కువసేపు ఆడలేదని చెప్పాను. విశ్లేషణ కోసం ఆమెకు వీడియోలు కూడా పంపించాను' అని రమణ తెలిపారు. ఈ నెల 3న సింధు తిరిగి హైదరాబాద్కు రానుంది.