
హైదరాబాద్: ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు మిశ్రమ ఫలితాలు ఎదురైయ్యాయి. సింధు, సైనాలపైనే ఆశలు పెట్టుకున్నవాళ్లకి సింధు ఒకింత ఆశాజనకంగానే ఆరంభించినా.. సైనా అంచనాలను అందుకోలేకపోయింది. పదేళ్లుగా పతకం కోసం పోరాడుతున్న స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఈసారి కూడా నిరాశపరిచింది.. పీవీ సింధు ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించి పతకం ఆశలు సజీవంగా నిలబెట్టింది.
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో సైనా 14-21, 18-21తో ప్రపంచ నంబర్వన్, డిఫెండింగ్ ఛాంపియన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. దీంతో ఐదేండ్ల కాలంలో తై జు చేతిలో ఓడటం ఈ హైదరాబాదీకి వరుసగా ఎనిమిదోసారి. కేవలం 38 నిమిషాల పాటు జరిగిన ఈ పోరాటంలో సైనా ర్యాలీలతో ఆకట్టుకున్నా.. తై జు అథ్లెటిక్ షాట్స్తో పూర్తి ఆధిపత్యం చూపెట్టింది.
తొలి గేమ్లో రెండుసార్లు 10-10, 14-14తో స్కోరు సమం చేసిన సైనా ఆ తర్వాత ఆటపై పట్టు కోల్పోయింది. తైవాన్ అమ్మాయి మాత్రం కచ్చితమైన సర్వీస్లు, నెట్ వద్ద డ్రాప్ షాట్లతో ఆకట్టుకుంది. పరిపూర్ణమైన యాంగిల్ స్ట్రోక్స్ను అలవోకగా కొట్టిన తై జు వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి గేమ్ను చేజిక్కించుకుంది. ఇక రెండో గేమ్ ఆరంభంలో సైనా 3-1, 10-7 ఆధిక్యం చూపెట్టినా.. ఆ తర్వాత వెనుకబడింది.
ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడటంతో ఓ దశలో స్కోరు 17-17తో సమమైంది. కానీ తై జు కొట్టిన రేజర్ షార్ప్ షాట్లకు సమాధానం చెప్పలేకపోయిన సైనా మ్యాచ్ను చేజార్చుకుంది. మరో మ్యాచ్లో సింధు 20-22, 21-17, 21-9తో పార్న్ పావి చొచ్వాంగ్ (థాయ్లాండ్)పై కష్టపడి నెగ్గి ప్రిక్వార్టర్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. డబుల్స్లో అశ్విని-సిక్కీ రెడ్డి 14-21, 13-21తో మట్సొమాటో-తకహసి (జపాన్) చేతిలో, మేఘన-పూర్విషా రామ్ 14-21, 11-21తో తనక-యెన్మెటో (జపాన్) చేతిలో ఓడారు.