ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మొదటి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేయగా.. పురుషుల సింగిల్స్లో సాయి ప్రణీత్, సమీర్ వర్మకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ఆరో సీడ్ పీవీ సింధు చైనా ప్రత్యర్థి వాంగ్జీ యిపై 21-18, 21-13తేడాతో విజయం సాధించింది. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి సింధుకు పోటీ ఎదురైనప్పటికీ, రెండో సెట్లో మాత్రం సునాయసంగా గెలిచింది. ఇక 2015 ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రన్నరప్ సైనా నెహ్వాల్ స్పెయిన్కు చెందిన బియట్రిజ్ కొరలెస్పై 21-17, 21-19 తేడాతో విజయం సాధించింది. రెండు సెట్లలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనప్పటికీ చివరికీ సైనానే విజయం వరించింది.
పురుషుల సింగిల్స్లో మాత్రం భారత్కు నిరాశజనక ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్లో భమిడిపాటి సాయి ప్రణీత్ డెన్మార్క్కు చెందిన ప్రపంచ నంబర్వన్, ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఒటమి పాలయ్యాడు. తొలి సెట్లో ప్రత్యర్ధికి బాగానే పోటీ ఇచ్చినప్పటికీ రెండో సెట్లో తేలిపోయాడు. దీంతో సాయి ప్రణీత్ 20-22, 11-21 తేడాతో ఓడి తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఇక మరో భారత సింగిల్స్ ఆటగాడు సమీర్ వర్మ కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. సమీర్వర్మపై నెదర్లాండ్స్కు చెందిన మార్క్ కాల్జౌ 18-21, 11-21 తేడాతో విజయం సాధించాడు. మరో భారత సింగిల్స్ ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ కూడా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రణయ్పై థాయ్లాండ్కు చెందిన కున్లవుత్ వితిద్సర్న్ 21-15, 24-22 తేడాతో గెలుపొందాడు.
ఇక డబుల్స్ విభాగంలో మాత్రం భారత్కు తొలి రోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి-ట్రెసా జంట 17-21, 22-20, 21-14 తేడాతో థాయ్లాండ్కు చెందిన బెన్యప ఎయిమ్సర్డ్-నుంతకర్న్ ఎయిమ్సర్డ్ జోడీపై విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇక సాత్విక్-చిరాగ్ జోడి స్కాట్లాండ్కు చెందిన అలెగ్జాండర్ డున్-ఆడమ్ హల్పై 21-17, 21-19 తేడాతో విజయం సాధించింది. అయితే సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీకి తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. జపాన్కు చెందిన రిన్ ఇవానగ-కీ నకనిషి చేతిలో 9-21, 13-21 తేడాతో ఓటమి పాలైంది. అర్జున్-ధ్రువ్ కపిల జోడీ ఇండోనేషియాకు చెందిన రెండో సీడ్ మొహమ్మద్ ఎహ్సాన్-హెండ్రా సెతియవాన్ చేతిలో 21-15, 12-21, 18-21 తేడాతో ఓడిపోయింది. ఇక గారగ కృష్ణప్రసాద్-విష్ణువర్ధన్ జోడీ జర్మనీకి చెందిన మార్క్ లామ్స్ఫుజ్-మార్విన్ సీడె చేతిలో 16-21, 19-21 ఓటమి చవిచూసింది.