బర్మింగ్హామ్: భారత స్టార్ షట్లర్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు.. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత రెండేళ్లుగా అంచనాల్ని అందుకోవడంలో నిరాశపరుస్తున్న సింధు.. ఈ టోర్నీలో గొప్ప పోరాటపటిమని కనబరుస్తోంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ఫైనల్లో సింధు 16-21, 21-16, 21-19తో జపాన్ షట్లర్ అకానె యమగూచిపై విజయం సాధించింది. యమగూచి గట్టి పోటీనివ్వడంతో.. మ్యాచ్ ఒక గంట 16 నిమిషాలు హోరాహోరీగా జరిగింది.
అనవసర తప్పిదాలతో తొలి గేమ్ను చేజార్చుకున్న పీవీ సింధు.. ఆ తర్వాతి రెండు గేమ్ల్లో జాగ్రత్తగా ఆడింది. యమగూచి గట్టి పోటీనిచ్చినా పట్టుదలగా పోరాడి గెలిచింది. సెమీ ఫైనల్లో థాయ్లాండ్కి చెందిన పోర్న్పావీ చోచువాంగ్తో పీవీ సింధు తలపడనుంది. 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన సింధు.. అప్పటి నుంచి 13 టోర్నీలు ఆడింది. కనీసం ఒక్క టోర్నీలో కూడా ఫైనల్కి చేరలేదు. ఇటీవల జరిగిన స్విస్ ఓపెన్లో ఫైనల్కి చేరినా.. తుది పోరులో కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది.
రెండవ రౌండ్ మ్యాచ్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 21-8, 21-8 స్కోర్తో డెన్మార్ ప్లేయర్ లైన్ క్రిస్టోఫెర్సన్ను సునాయాసంగా ఓడించింది. కేవలం 25 నిమిషాల్లోనే ఆమె మ్యాచ్ను ఫినిష్ చేసింది. సింధు దూకుడు ఆట ముందు క్రిస్టోఫెర్సన్ ఏమాత్రం నిలవలేకపోయింది. రెండు సెట్లలో కూడా లైన్ పోరాటపటిమ కూడా కనబరచలేకపోయింది.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 17-21, 21-16, 17-21తో మార్క్ కాల్జో (నెదర్లాండ్స్) చేతిలో ఓడాడు. మరో యువ ఆటగాడు సమీర్ వర్మ ప్రిక్వార్టర్స్లోనే వెనుదిరిగాడు. అతడు 20-22, 10-21తో అండ్రెస్ (డెన్మార్క్) చేతిలో ఓటమిపాలయ్యాడు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో అశ్విని-సిక్కి జోడీ 22-24, 12-21తో సెలెనా పెక్-చెరెల్ సీనెన్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయంపాలైంది. మిక్స్డ్ డబుల్స్ మేఘన-ధ్రువ్ కపిల జోడీ ప్రిక్వార్టర్స్లోనే నిష్క్రమించింది.
India vs England: ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్కు గట్టి ఎదురుదెబ్బ!