
హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ ప్రికార్టర్ ఫైనల్లో తన ఓటమికి అంపైర్ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలే కారణమని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సర్వీస్లో పదే పదే తప్పిదాలను చూపించడం వల్లే ఓటమి పాలయ్యానని పేర్కొన్నాడు.
గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ శ్రీకాంత్ 11-21, 21-15, 20-22తో ప్రపంచ 42వ ర్యాంకర్ హువాంగ్ యుజియాంగ్ (చైనా) చేతిలో ఓడాడు. నిర్ణాయక మూడో గేమ్లో శ్రీకాంత్ 20-18తో విజయానికి చేరువగా వచ్చాడు.
వరుసగా 4 పాయింట్లు చేజార్చుకుని అతడు ఓటమిపాలయ్యాడు. ఓటమి అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ 'తొలి గేమ్లో ఎన్నో సర్వీస్ తప్పిదాలను అంపైర్ ప్రకటించాడు. అలా జరుగుతుందని అనుకోలేదు. టోర్నీ మొదటి మ్యాచ్లో అంపైర్ ఒక్క తప్పు కూడా ఎత్తిచూపలేదు. కానీ రెండోరోజు బాధ్యతలు నిర్వర్తించిన అంపైర్కు మాత్రం నా సర్వీస్లో ఎన్నో లోపాలు కనిపించాయి' అని అన్నాడు.
'ఈ నిబంధన హాస్యాస్పదం. ఇది సరికాదు. ఆటలో సర్వీస్పైనే ఎక్కువగా దృష్టి సారించాల్సి వస్తుంది. సర్వీస్ ఫాల్ట్ అని అంపైర్ ప్రకటించగానే ఒత్తిడిలోకి వెళ్తున్నా' అని శ్రీకాంత్ కొత్తగా ప్రవేశపెట్టిన సర్వీస్ నిబంధనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు భారత్కు చెందిన డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ షెట్టి కూడా రెండో రౌండ్లో కంగుతిన్నారు.
రెండోసీడ్ డెన్మార్క్ ద్వయం బొమథియాస్-మోగిన్సెన్ చేతిలో 16-21, 21-16, 21-23 స్కోరుతో సాత్విక్ జోడీ ఓడిపోయింది. సాత్విక్, షెట్టి జోడీ కూడా అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి ప్రకటించింది. ఈ ఏడాది మెగా టోర్నీలన్నింటిలో కొత్త సర్వీస్ నిబంధన ప్రవేశపెట్టాలని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్ణయించిన సంగతి తెలిసిందే.