లండన్: మహమ్మారి కరోనా (కొవిడ్ 19) వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 7,000 మంది మృతి చెందగా.. లక్షా 75వేల మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో క్రీడాలోకం మొత్తం అతలాకుతలం అయింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని టోర్నీలు వాయిదా లేదా రద్దవుతున్నాయి. అయితే కరోనా ముప్పు ఉన్నా.. వింబుల్డన్ నిర్వాహకులు ఈ సంవత్సరం గ్రాండ్స్లామ్ టోర్నీని నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నారట.
వకార్ యూనిస్ అసంతృప్తి.. భారత్-పాక్ సమరం లేని ఆ టోర్నీ అర్థరహితం!!
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వింబుల్డన్ జూన్ 29 నుండి జూలై 12 వరకు జరుగనుంది. అయితే కరోనా కారణంగా టోర్నీలు అన్ని రద్దవుతున్నాయి. ఈ క్రమంలో వింబుల్డన్ కూడా రద్దవుతుందనుకుంటే.. నిర్వాకులు మాత్రం టోర్నీ నిర్వహించడం కోసం ప్రణాళికలు చేస్తున్నారట. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని, వింబుల్డన్ కొనసాగుతుందని నిర్వాహకులు ధీమాగా ఉన్నారు. ప్రధాన కోర్టులలో ఫ్లడ్ లైట్లతో మ్యాచ్లు నిర్వహిస్తారట. అయితే ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రోకెట్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయిస్ ప్రజల భద్రతే మొదటి ప్రాధాన్యం అని అపట్టుపడుతున్నాడట. మరి ఎం జరుగుతుందో చూడాలి.
2019 వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ను సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్తో జరిగిన తుది పోరులో.. నొవాక్ అద్భుత విజయం అందుకున్నాడు. ఫెదరర్పై నొవాక్ 7-6, 1-6, 7-6, 4-6, 13-12 తేడాతో గెలుపొందాడు. ఐదు సెట్ల పాటు కొనసాగిన మ్యాచ్.. దాదాపు ఐదు గంటల పాటు నిర్విరామంగా కొనసాగడం విశేషం. మాఓవైపు సిమోనా హాలెప్ మహిళల టైటిల్ గెలుచుకుంది.
కరోనా వైరస్ కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ వాయిదా పడింది. సెప్టెంబరు 20 నుంచి అక్టోబర్ 4 వరకు టోర్నీని రీషెడ్యూల్ చేస్తున్నట్టు నిర్వాహకులు ట్వీట్ చేశారు. వాస్తవంగా మే 24 నుంచి జూన్ 7 వరకు ఫ్రెంచ్ ఓపెన్ జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టోర్నీని జరపలేమని నిర్వాహకులు తెలిపారు. రీషెడ్యూల్ ప్రకారం యూఎస్ ఓపెన్ ముగిసిన వారం రోజుల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరగనుంది.