ఒక రోజు ముందు ట్విన్ టవర్స్లోనే:
తాజాగా లియాండర్ పేస్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ... '2001లో 9/11 దాడులు జరిగే కంటే కొద్ది రోజులు ముందే నేను యూఎస్ ఓపెన్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాను. నాటో పాటు మహేశ్ భూపతి కూడా ఉన్నాడు. యూఎస్ ఓపెన్ మొదటి రౌండ్లోనే మేం ఓడిపోయాం. అయితే అదే నెల చివరలో డేవిస్ కప్ కూడా ఉండటంతో అమెరికాలోనే ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో ట్విన్ టవర్స్పై విమాన దాడులు జరిగాయి. దీంతో ఆటగాళ్లు చాలా గందరగోళానికి గురయ్యారు. దాడి జరిగే కంటే ఒక రోజు ముందు నేను ట్విన్ టవర్స్లోనే ఉన్నాను. విషయం తెలుసుకుని చాలా భయపడ్డా' అని అన్నాడు.
కారు అద్దెకు తీసుకుని ఫ్లోరిడా వెళ్లిపోయా:
'ట్విన్ టవర్స్ నుంచి డేవిస్ కప్లో పాల్గొనేందుకు కారులో విమానాశ్రయానికి వెళ్తుంటే.. టవర్స్పై దాడి గురించి తెలిసింది. మొదట దాన్ని విమాన ప్రమాదమనుకున్నా. అయితే రెండో విమానం కూడా టవర్స్పైకి దూసుకురావడంతో ఎవరో ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడేనని అర్థమైంది. ఆ సమయంలో నా కోచ్, స్నేహితులు న్యూయార్క్లోనే ఉన్నారు. దాంతో వెంటనే వారికి ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నాను. ట్విన్ టవర్స్పై దాడి కారణంగా విమానాలు రద్దు కావడంతో కారు అద్దెకు తీసుకుని ఫ్లోరిడా వెళ్లిపోయాను. ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా' అని భారత టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ తెలిపాడు.
భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదు:
'దాడుల సమయంలో నా భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదు. అప్పుడు విమాన ప్రయాణాలపై చాలా ఆంక్షలు ఉండేవి. దాడుల కారణంగా సెప్టెంబరు 21-23 మధ్య జరగాల్సిన డెవిస్ కప్.. అక్టోబరు 12-14 మధ్య నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆటకు సంబంధించిన సామగ్రిని కూడా వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదు. ముఖ్యంగా ప్రొఫెషనల్ షూటర్లు ఆయుధాలు, టెన్నిస్ ఆటగాళ్లు రాకెట్లు తీసుకెళ్లడానికి భద్రతాపరంగా చాలా సమస్యలు ఎదురయ్యేవి. భద్రతాధికారులు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విమాన ప్రయాణాలకు అనుమతించేవారు. ఎలాగోలా కష్టపడి నార్త్ కరోలినా చేరుకున్నాం. అక్కడ అమెరికా ఆటగాళ్లు మాకు ఘనంగా స్వాగతం పలికారు' అని పేస్ చెప్పాడు.
కిమ్ శర్మతో డేటింగ్:
'ఇక టెన్నిస్ కోర్టంతా ప్రేక్షకులతో నిండిపోయింది. మ్యాచ్ ఆరంభానికి ముందు మేమంతా ట్విన్ టవర్స్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు నివాళి అర్పించాం. అనంతరం ప్రారంభమైన టోర్నీలో అమెరికా ఆటగాళ్లు రోడిక్, బ్లేక్ జోడి టైటిల్ గెలుచుకున్నారు. ఆ ఏడాది మాకు ఏది కలిసిరాలేదు' అని లియాండర్ పేస్ అప్పటి తన అనుభవాలను పంచుకొన్నాడు. ఇక బాలీవుడ్ నటి కిమ్ శర్మతో పేస్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరూ ఇటీవల గోవా బీచ్లో దర్శనమిచ్చి తమ ప్రేమాయణం నిజమే అని చెప్పారు. ఇటీవల పలుమార్లు కిమ్ శర్మ, లియాండర్ పేస్లు ముంబైలో కనిపించారు. లియాండర్ గతంలో మోడల్ రియా పిళ్లైను పెళ్లి చేసుకున్నాడు. ఇక కిమ్ శర్మ కూడా గతంలో హీరో హర్షవర్దన్ రాణేతో డేటింగ్ చేసింది.