జూనియర్ స్థాయిలోనే సంచలనాలు:
భారత టెన్నిస్ అంటే ముందుగా మనకు లియాండర్ పేస్ పేరు గుర్తుకు వస్తుంది. దేశ టెన్నిస్ చరిత్రలో అతని అధ్యాయం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 1991లో ప్రొఫెషనల్ ఆటగాడిగా మారిన పేస్.. 30 ఏళ్ల కెరీర్లో ఎన్నో ప్రతిష్ఠాత్మక విజయాలు అందుకున్నాడు. దేశానికి ఎన్నో చిరస్మరణీయ జ్ఞాపకాలను అందించాడు. కోల్కతాలో పుట్టిన పేస్.. అంతర్జాతీయ ప్లేయర్లు అయిన తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టెన్నిస్ వైపు నడిచాడు. చిన్నతనంలోనే రాకెట్ పట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. జూనియర్ స్థాయిలోనే సంచలనాలు నమోదు చేశాడు. యుఎస్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ గెలిచి జూనియర్ ప్రపంచ నంబర్వన్గా అవతరించాడు. దాంతో పేస్ పేరు మార్మోగిపోయింది. భారత్ నుంచి ఓ యువ టెన్నిస్ ఆటగాడు దూసుకొస్తున్నాడనే విషయం ప్రపంచానికి అర్ధమయింది.
ప్రజా సేవ కోసమే:
సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మరపురాని విజయాలు సాధించిన లియాండర్ పేస్.. 2020 టోక్యో ఒలింపిక్స్ ఆడిన తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని గతంలో ప్రకటించాడు. కానీ కరోనా కారణంగా ఆ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడడం, ఒలింపిక్స్కు అర్హత సాధించకపోవడంతో ఇన్ని రోజులు ఆ విషయం తెరపైకి రాలేదు. శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)లో చేరడంతో టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకున్నట్లు ప్రకటించాడు. ప్రజా సేవ కోసమే తాను రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ప్రజలకు అండగా నిలబడతానని హామీ ఇచ్చాడు.
ఏకైక ఆటగాడిగా:
17 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా మారిన లియాండర్ పేస్ సంచలన ప్రదర్శనతో దూసుకెళ్లాడు. 22 ఏళ్లకే 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో కాంస్యం గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ చరిత్రలో టెన్నిస్లో భారత్కు పతకం అందించిన ఏకైక ఆటగాడిగా పేస్ కొనసాగుతున్నాడు. 1992 నుంచి 2016 వరకూ వరుసగా ఏడు ఒలింపిక్స్ల్లో పాల్గొన్న తొలి టెన్నిస్ ప్లేయర్గా, ఏకైక భారత అథ్లెట్గా అతను నిలిచాడు. ఇక డబుల్స్ ఆటగాడిగా పేస్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కెరీర్లో ఏకంగా 18 గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచాడు. అందులో 10 మిక్స్డ్ డబుల్స్లో, 8 పురుషుల డబుల్స్లో నెగ్గాడు. ఈ రెండు విభాగాల్లోనూ కెరీర్ గ్రాండ్స్లామ్ సాధించాడు.
ఆల్టైమ్ రికార్డు:
డేవిస్ కప్ చరిత్రలోనే 45 డబుల్స్ విజయాలతో ఆల్టైమ్ రికార్డును లియాండర్ పేస్ ఖాతాలో వేసుకున్నాడు. దేశ క్రీడా అత్యున్నత పురస్కారమైన ఖేల్రత్నను దక్కించుకున్న పేస్.. మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషన్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. టెన్నిస్లో దిగ్గజంగా ఎదిగిన పేస్.. ఇప్పుడు రాజకీయాలపై దృష్టి సారించాడు. టెన్నిస్ ఆటగాడిగా రాకెట్ పట్టి కోర్టులో సంచలనాలు నమోదు చేసిన అతను.. రాజకీయ నాయకుడిగా తన రెండో ఇన్నింగ్స్ మొదలెట్టాడు. టెన్నిస్ కెరీర్ మాదిరే రాజకీయంలో కూడా పేస్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.