జర్మనీకి చెందిన మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు బోరిస్ ఫ్రాంజ్ బెకర్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. దీంతో కెరీర్లో సాధించిన పతకాలు, ఇతర విలువైన వస్తువులు వేలానికి వచ్చాయి. వేలం ప్రక్రియ సోమవారం ఆన్లైన్లో ప్రారంభమైంది. బెకర్కు సంబంధించిన మొత్తం 83 వస్తువులు జూలై 11 వరకు జరిగే వేలంలో అందుబాటులో ఉంటాయి. ఇందులో మెడల్స్, కప్లు, వాచ్లు, ఫొటోలు ఉన్నాయి. అన్నింటినీ బ్రిటీష్కు చెందిన వేల్స్ హార్డీ కంపెనీ వేలం వేయనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
కోట్లాది అప్పులను తీర్చలేక 2017లో బెకర్ దివాలా ప్రకటించారు. బెకర్కు సంబంధించిన పతకాల వేలం గత ఏడాదే జరగాల్సి ఉండే. తాను సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ తరఫున యూరోపియన్ యూనియన్కు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నానని.. ఈ హోదా ఉన్నందున తన పతకాలను వేలం వేయడానికి వీల్లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే బెకర్కు అలాంటి నియామక పత్రాలు ఏవీ ఇవ్వలేదని సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ ఇటీవల ప్రకటించింది. మరోవైపు 2014లో అదృశ్యమైన ఓ ఖాళీ పాస్పోర్టును బెకర్ ఫోర్జరీ చేశాడని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాడని కూడా ఆరోపించింది. ఈ వివాదంపై కోర్టు కేసు నడుస్తుండగా.. గతంలో పతకాల వేలానికి అనుమతి పొందిన వేలిస్ హార్డీ సంస్థ సోమవారం అధికారికంగా వేలం ప్రకటించింది.
బెకర్ ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మరియు ఒలింపిక్ బంగారు పతాక విజేతగా నిలిచాడు. 17 ఏళ్ళ వయసులో అత్యంత చిన్నవయసులో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన ఆటగాడుగా రికార్డుల్లో ఉన్నాడు. కెరీర్లో 49 టైటిళ్లు సాధించిన బెకర్ 2,27,89,100 డాలర్లు సంపాదించాడు. అయితే సహజీవనం, విచ్చలవిడిగా ఖర్చులు, కోర్టు కేసుల్లో ఇరుక్కుని డబ్బు పోగొట్టుకున్నాడు. ప్రస్తుత వేలం ద్వారా వచ్చే సొమ్ముతో అతని అప్పులు పూర్తి స్థాయిలో తీరే అవకాశం లేదు. ఇంకా మిలియన్ డాలర్ల మేర అతను రుణాలను చెల్లించాల్సి ఉంటుంది.