న్యూఢిల్లీ, జూన్ 29: డబుల్స్లో అఖిల భారత టెన్నిస్ సంఘం ప్రకటించిన జట్టుతో ఆడేందుకు తాను సిద్దమని భారత్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తెలిపాడు. దీంతో గత కొన్ని రోజులుగా టెన్నిస్ చెలరేగిన దుమారం సద్దుమణిగింది. అఖిల భారత టెన్నిస్ సంఘం ప్రకటించిన తన డబుల్స్ పాట్నర్ విష్ణు వర్దన్తో కలిసి తన ఆరో ఒలింపిక్స్ ఆడేందుకు సిద్దమని లియాండర్ పేస్ స్పష్టం చేశాడు.
టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ నేను లండన్ ఒలంపిక్స్లో ఆడుతున్నాను. చెత్త రాజకీయాల వల్లు హార్డ్ వర్క్, మంచి టెన్నిస్ను ఏమీ చేయలేవని అన్నారు. లండన్ ఒలంపిక్స్ నేను ఆడనున్న ఆరో ఒలంపిక్స్. ఆల్ ఇండియా టెన్నిస్ అసొసియేషన్ ప్రకటించిన టీమ్తో ఆడేందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్న పేస్, సానియా మిర్జా ఎవరితో ఆడాలన్న దానిపై లియాండర్ మాత్రం వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు.
39 సంవత్సరాల వయసు కలిగిన పేస్, ఇటీవల అఖిల భారత టెన్నిస్ సంఘం ప్రకటించిన జోడీతో ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో లండన్ ఒలంపిక్స్ నుండి తప్పుకోనున్నట్లు వదంతులు వచ్చిన విషయం తెలిసిందే. ఐతే వీటన్నింటిని తిప్పుకొడుతూ దేశం తరుపున నేను ఎప్పుడూ సిద్దమే. నేను ఇక్కడ ఉంది ఆట ఆడేందుకు మాత్రమే రాజకీయాలు ఆడేందుకు కాదని స్ఫష్టం చేశాడు. గత 22 సంవత్సరాలుగా నేను నా దేశ ప్రజల కోసం, జెండా కోసం ఆడుతున్నానని అన్నాడు.
లండన్ ఒలంపిక్స్లో ఆడేందుకు వైల్డ్ కార్డు ద్వారా అనుమతి లభించిన తర్వాత సానియా మీర్జా మీడియా ముందు మాట్లాడుతూ లండన్ ఒలంపిక్స్లో ఇండియా తరుపున పాల్గోనడం నిజంగా ఆనందాన్నిస్తుంది. నా జీవితంలో రెండవ సారి ఒలంపిక్స్కు నా భారతదేశం తరుపున ఆడడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నాకు అవకాశం కల్పించిన అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్కు కృతజ్ఞతలు తెలియజేస్తానని అన్నారు. పేస్తో మిక్స్డ్ డబుల్స్ ఆడేందుకు సిద్దమన్న సానియా మిర్జా.. టెన్నిస్ సంఘం తనను అవమానించిందని పేర్కొంది. టెన్నిస్ సంఘంతో పాటు పేస్, భూపతిలపైన కూడా సానియా తీవ్ర స్థాయిలో స్పందించింది. టెన్నిస్ సంఘం తనను ఎరగా వాడుకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఐతే ఇటీవల ఇండియన్ టెన్నిస్లో జరగుతున్న పరిణామాలు తనను వత్తిడికి గురిచేశాయని సానియా తెలిపింది. 21వ శతాబ్దపు భారతీయ మహిళగా నాకిది అవమానం. రెండు గ్రాండ్ స్లామ్లు గెలిచిన, దశాబ్దకాలంగా భారత్ నెంబర్ వన్ క్రీడాకారిణిగా ఉన్న నన్ను ఎంపిక చేసిన తీరు పురుషాధిక్యానికి నిదర్శనం అని చెప్పింది. ఒలింపిక్స్ కోసం మిక్స్డ్ డబుల్స్ టీమ్ను ఎంపిక చేసిన తీరుపై ఆమె ధ్వజమెత్తింది.
తెలుగు వన్ఇండియా