నిరసనలకు మద్దతుగా:
పోలీసుల దౌర్జన్యం వల్ల ఆఫ్రో-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మే 25న మరణించిన విషయం తెలిసిందే. జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు మద్దతుగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలెక్సిస్ ఒహానియాన్ తెలిపారు. తన కోసం, తన కుటుంబం కోసం, తన దేశం కోసం ఈ విధంగా చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు తాను ఇప్పటివరకూ ఆర్జించిన సంపదను నల్ల జాతీయుల సేవకు వినియోగిస్తానని కూడా ప్రకటించారు.
నా వద్ద ఓ సరైన సమాధానం ఉండాలి:
ఓహానియన్ ఆన్లైన్లో పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ... 'చాలా కాలంగా సరైన పనిచేయడానికి సమయం ఆసన్నం అయింది. నా కుమార్తె పెద్దయ్యాక నువ్వేం చేశావ్ నాన్నా? (జార్జి ఫ్లాయిడ్ మృతి ఘటన గురించి) అని అడిగితే.. నా వద్ద ఓ సరైన సమాధానం ఉండాలి. తనకు ఈ విషయం గర్వంగా చెపుకుంటా. అందుకే రాజీనామా చేశా' అని 37 సంవత్సరాల ఒహానియాన్ వివరించారు. సెరెనా, ఓహానియన్ మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ పాప (అలెక్సిస్ ఒలంపియా ఒహనియన్ జూనియర్) ఉంది.
రెడిట్ సంస్థపై విమర్శలు:
ప్రస్తుత పరిస్థితుల్లో ట్విటర్, స్నాప్చాట్ మాదిరిగా దృఢ నిశ్చయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్టులను ఖండించకపోవటాన్ని కొందరు రెడిట్ యూజర్లు తప్పుపట్టారు. అంతేకాకుండా ట్రంప్కు మద్దతుగా ఏర్పాటైన సబ్ రెడిట్ సమూహాన్ని మూసివేయకపోవటంపై కూడా సంస్థపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెడిట్కు అలెక్సిస్ ఒహానియాన్ రాజీనామా చేయటం విశేషం.
ఆస్ట్రేలియన్ ఓపెన్లో పరాజయం:
ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో అమెరికా నల్ల కలువ సెరీనా విలియమ్స్కు భారీ షాక్ తలిగింది. గతంలో ఏడు సార్లు చాంపియన్గా నిలిచిన సెరీనాను మూడవ రౌండ్లో చైనాకు చెందిన వాంగ్ కియాంగ్ ఓడించారు. రసవత్తర పోరులో వాంగ్ కియాంగ్ 6-4, 6-7, 7-5 తేడాతో సెరెనాపై నెగ్గింది. అంతకుముందు యుఎస్ ఓపెన్ ఫైనల్లో కూడా ఓడిపోయారు. ఫలితంగా అత్యధికంగా సింగిల్స్ గ్రాండ్స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న మార్గరెట్ కోర్టు రికార్డును సమం చేసేందుకు సెరీనా విలియమ్స్ మరో గ్రాండ్ స్లామ్ టోర్నీ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.