
హైదరాబాద్: దాదాపు ఏడాది విరామం తర్వాత తిరిగి రాకెట్ పట్టి టెన్నిస్ మ్యాచ్ ఆడిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్కు వరుసగా రెండోసారీ నిరాశే ఎదురైంది. తన సోదరి వీనస్ విలియమ్స్తో కలిసి ప్రతిష్ఠాత్మక ఫెడరేషన్ కప్లో తన దేశం తరపున డబుల్స్ బరిలోకి దిగిన సెరెనాకు చేదు అనుభవం ఎదురైంది.
ఫెడ్ కప్లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన ఈ పోరులో అమెరికా జట్టు 3-1తో గెలిచినప్పటికీ, విలియమ్స్ సిస్టర్స్ జోడీ డబుల్స్లో 2-6, 3-6తో డెమి స్చూర్స్- లెస్లీ కెర్కోవ్ జోడీ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం పాలైంది. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో విజేతగా నిలిచిన సెరెనా ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడంతో దాదాపు ఏడాదిగా ఆటకు దూరంగా ఉంది.
తిరిగి రాకెట్ పట్టి గత డిసెంబర్లో ఆడిన ఎగ్జిబిషన్ మ్యాచ్లోనూ ఆమె గెలవలేకపోయింది. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తర్వాత సెరెనా పోటీపడ్డ రెండో మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్కు సెరెనా భర్త అలెక్సిస్ ఒహానియన్ కూతురు అలెక్సిస్ ఒలింపియాతో కలిసి హాజరయ్యాడు.
ఓవైపు కోర్టులో సెరెనా మ్యాచ్ ఆడుతుండగా, గ్యాలరీలో ఒహానియన్ తన కుమార్తెకు పాల సీసా పట్టిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కాగా, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో సెరెనా దిగుతుందని అంతా భావించారు.
అయితే సెరెనా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో టోర్నీ నుంచి తప్పుకుంది. త్వరలో జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్తో పునరాగమనం చేయాలనుకుంటోంది. ఇదిలా ఉంటే ఫెడరేషన్ కప్లో వీనస్ విలియమ్స్ తన 1000వ సింగిల్స్ మ్యాచ్ ఆడటం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.